Off The Record: తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా..?

  • తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేకి ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతోందా?..
  • సొంత కులానికి దూరం అవుతానని బొలిశెట్టి భయపడుతున్నారా?..
  • వైసీపీ కాపు నేతలకు కౌంటర్స్‌ వేసేందుకు పార్టీ తరపున వాయిస్‌..
  • ఎమ్మెల్యే అయ్యానన్న ఆనందంకంటే ఇదెక్కడి గోల అన్న అసహనం..
  • ఎమ్మెల్యేతో కలిసిరాని తాడేపల్లిగూడెం టీడీపీ నాయకులు..
  • తేడా కొడితే సొంత కులానికి నేనే టార్గెట్‌ అవుతానని బొలిశెట్టి భయం?..
  • ఇప్పుడు తెలిసొస్తోందా అంటూ సొంత కేడర్‌ సెటైర్స్‌..
Otr Tadepalligudem

Otr Tadepalligudem

Off The Record: తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఫ్రస్ట్రేషన్‌ పెరిగిపోతోందట. దీన్నుంచి నేను బయటపడలేకపోతున్నానురా… బాబో…. అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న తలనొప్పులు భరించలేక నానా తంటాలు పడుతుంటే…. కొత్తగా పార్టీ అధిష్టానం ఇస్తున్న ఆదేశాలతో సొంత కులానికి కూడా దూరమయ్యే ముప్పు ముంచుకొస్తోందని తల బాదుకుంటున్నట్టు తెలుస్తోంది. కాపు కులం కేంద్రంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణాలు ఆయన్ని ఇరకాటంలో పడేస్తున్నాయంటున్నారు. ఇటీవల వైసీపీ కాపు నేతలంతా కలిసి మీటింగ్‌ పెట్టుకున్నాక జరుగుతున్న పరిణామాల మీద, పార్టీ తరపున కౌంటర్స్‌ వేసేందుకు ముందుండమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేని ఆదేశించిందట జనసేన అధిష్టానం. అందుకు తగ్గట్టే ప్రత్యర్థుల్ని…. అదీకూడా సొంత సామాజికవర్గానికి చెందిన వాళ్ళని గట్టిగానే టార్గెట్‌ చేస్తున్నారు బొలిశెట్టి శ్రీనివాస్. అలాగే… ఆయన ఏం మాట్లాడినా వెంటనే వైసీపీ కాపు నేతల వైపునుంచి రివర్స్‌ పంచ్‌లు కూడా స్ట్రాంగ్‌గా పడుతున్నాయి. దీంతో బొలిశెట్టి బాగా ఫీలవుతున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో చాలామంది జనసేన నాయకులు ఉన్నప్పటికీ… ప్రతిపక్ష నేతల్ని, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గ నేతలను ఎదుర్కోవడం ఓ రకంగా ఇబ్బందికరమేనని భావిస్తున్నారట. దీంతో… ఎమ్మెల్యే అయ్యానన్న ఆనందంకంటే… ఇదెక్కడి పొలిటికల్‌ కులగోల అన్న అసహనమే పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు సొంత నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనతో కలిసి పని చేయడానికి ముందుకు రాకపోగా… ఇమేజ్‌ని డామేజ్ చేయడానికి చేస్తున్నారట. అందుకే… శత్రువులుగా మారిన మిత్ర పార్టీ నేతలతో పోరాడడానికే రెండేళ్లు సరిపోయిందంటూ ఏ వేదికల మీద బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన. కలిసి పని చేయండని రెండు పార్టీల అధిష్టానాలు ఆదేశిస్తున్నా…తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం నాయకులు మాత్రం జనసేనతో కలిసి ముందుకెళ్లేందుకు ససేమిరా అంటున్నారన్నది ఎమ్మెల్యే మాట. పైగా ఎమ్మెల్యే ఎంతో మేమూ అంతేనన్నట్టుగా టిడిపి ఇన్చార్జ్ వలవల బాబ్జీ వ్యవహరిస్తున్నారన్నది బొలిశెట్టి వర్గం కంప్లయింట్‌. ఇలాంటి సమయంలో వైసీపీని ఏకిపారేయాల్సి రావడం అదనపు తలనొప్పిగా మారిందన్నది ఆయన సన్నిహితుల మాట. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మాటల తూటాలు సరిగ్గా టార్గెట్ చేరితే సరే.. ఎక్కడైనా రివర్స్ అయిందంటే అసలుకే ఎసరు వచ్చి సొంత కులం వాళ్ళకే తాను టార్గెట్‌ అవుతానన్న భయం కూడా బొలిశెట్టిని వెంటాడుతోందట.

×
×
Ad

దాంతో అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూనే.. కాపు కులానికి చెందిన ప్రత్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తోందని, ఫైనల్‌గా అందరి టార్గెట్ నేనే అవుతానా అన్న అనుమానం సైతం ఆయన్ని వెంటాడుతోందట. మిత్ర పార్టీ నేతలతో ఇంట గెలిచేందుకు ఇప్పటికే నానా తంటాలు పడుతుంటే.. ఇప్పుడు రచ్చ గెలవాల్సిన అనివార్యత ఎదురవుతోంది. ఇదే విషయాన్ని చెబుతూ…. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను బాహుబలి అని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమవుతోందని సన్నిహితుల దగ్గర సెటైర్లు సైతం వేస్తున్నారట ఎమ్మెల్యే. రోజు రోజుకి కాక పెంచుతున్న జనసేన వర్సెస్ వైసీపీ రాజకీయం ఒకవైపు, తాడేపల్లిగూడెంలో టిడిపి వర్సెస్ జనసేన ఫైట్‌లో ఎవరు కట్టప్పలవుతారో అర్థం కాని అయోమయం మరోవైపు కలగలిసి తీవ్ర గందరగోళంలో ఉన్నారట శ్రీనివాస్‌. దీంతో కూటమిలోని ఇబ్బందులేంటో తన దాకా వస్తేగానీ… ఎమ్మెల్యేకి తెలియడం లేదా? ఇప్పటికైనా మా బాధలేంటో అర్ధం చేసుకోండని కింది స్థాయి నాయకులు సూటిపోటి మాటలు అంటున్నారట. అలా మొత్తం మీద మా ఎమ్మెల్యే గట్టిగానే ఇరుక్కున్నారన్నది తాడేపల్లిగూడెం టాక్‌.