Off The Record: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు పైఎత్తులతో యమా రంజుగా మారుతోంది రాజకీయం. మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష కౌన్సిలర్లను ఇబ్బందులు పెడుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అటు కాంగ్రెస్ నుంచి కూడా అదే రేంజ్లో రివర్స్ అటాక్ ఉండటంతో… కథ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఎన్నికల్లో గెలవడం కోసం బీఆర్ఎస్ అభ్యర్థులు అడ్డదారులు తొక్కారంటూ ఆధారాలు చూపిస్తోంది కాంగ్రెస్. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక
ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడింది. రాళ్ల దాడి, కౌన్సిలర్ల మధ్య గొడవలు, బహిరంగ దాడులు, కోర్ట్ స్టే, మాజీ ఎమ్మెల్యేకు, ఆయన కుమారుడికి నోటీసులు.. ఇలా ఒకటేమిటి…. రకరకాలుగా అంతు చిక్కని ట్విస్ట్లతో ఇబ్రహీంపట్నం పొలిటికల్ స్క్రీన్ మామూలుగా కనిపించడం లేదు.
మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి అదృశ్యం కేసు మొదలు.. ఇబ్రహీపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం వరకు అన్నీ ఊహించని మలుపులే. దీంతో మున్సిపల్ రాజకీయం రచ్చకెక్కింది. ప్రస్తుతం ఇక్కడ గెలుపుకంటే ఎక్కువగా.. ప్రత్యర్థిని పడగొట్టడమన్న టార్గెట్తో పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా… ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 13. ఇక పార్టీల గెలుపు లెక్కలు చూసుకుంటే…. బీఆర్ఎస్కు 14 మంది కౌన్సిలర్స్ ఉన్నారు. అంటే.. సరిపడా మెజార్టీ సాధించినట్టే. కానీ… ఛైర్మన్ ఎన్నిక అంటేనే ఆ పార్టీ బెంబేలెత్తిపోతోంది. ఇక్కడే రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. ఇక్కడ కాంగ్రెస్ ఏడు, బీజేపీ 2 వార్డులను గెల్చుకోగా…. ఒకచోట ఇండిపెండెంట్ విజయం సాధించారు. అయితే… సరిపడా సీట్లు వచ్చాయన్న మాటేగానీ… బొటాబొటీ మెజార్టీ కారణంగా… సొంత కౌన్సిలర్స్ ఇద్దరు ముగ్గురు హ్యాండ్ ఇస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన గులాబీ పెద్దల్ని వెంటాడుతోందట. అదే ఇప్పుడు నియోజకవర్గ పార్టీ నాయకులకు కూడా నిద్ర లేకుండా చేస్తోందని అంటున్నారు. ఇక 23వ వార్డు కౌన్సిలర్ నీలం శ్వేత ఓసీ అయి ఉండి.. బీసీగా అవతారమెత్తారన్న ఆరోపణలున్నాయి. గెలవడం కోసం ఆమె కులాన్నే మార్చేశారని, నకిలీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారన్న ఫిర్యాదులతో బీఆర్ఎస్ శిబిరంలో కలవరం మొదలైందట. ఇక 21వ నంబర్ వార్డులో బీఆర్ఎస్ నుంచే గెలిచారు బుగ్గ రాములు. ఆయన ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పేతుళ్ళలో ఓటు వేశారని, అదే వ్యక్తి తిరిగి ఇబ్రహీంపట్నం టౌన్లో కౌన్సిలర్గా ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. చట్టం కళ్ళు గప్పి చేసిన ఈ డబుల్ ఓటు వ్యవహారం ఇప్పుడు బట్టబయలైందంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
అలా… నకిలీ సర్టిఫికెట్లతో ఒకరు.. డబుల్ ఓటుతో మరొకరు.. కిడ్నాప్ కేసులో ఇంకొక బీఆర్ఎస్ కౌన్సిలర్ మీద కేసులు బుక్ అయ్యాయి. మరోవైపు బీఆర్ఎస్ క్యాంప్ పాలిటిక్స్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ వేసింది. మున్సిపాలిటీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్ ఓటింగ్ వద్దు.. సీక్రెట్ బ్యాలెట్ కావాలంటూ పట్టుబట్టింది. ఆ విధంగా రహస్య ఓటింగ్ పెడితే.. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు తమ వైపు మొగ్గుతారన్నది హస్తం పార్టీ ధీమా. అయితే అది అప్పుడు సాధ్యపడలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి ఎన్నికల కమిషన్ చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి ఎలక్షన్ డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. అయితే ఈసారి రహస్య ఓటింగ్ పెడితే తమ పరిస్థితి ఏంటని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా బీఆర్ఎస్ యువ నాయకుడు ప్రశాంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడంతో ఇబ్రహీంపట్నం రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఈ పరిస్థితుల్లో సరిపడా మెజార్టీ ఉందని అనుకుంటున్నా….ఫైనల్గా నంబర్ గేమ్లో ఎక్కడ దెబ్బపడుతుందోనని ఆందోళన పడుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. తనను మానసికంగా వేధించారని, కిడ్నాప్ చేశారని యాదగిరి స్వయంగా కోర్టులో చెప్పడం.. ఇప్పుడు మంచిరెడ్డి ఫ్యామిలీ మెడకు చుట్టుకుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ యాదగిరి ముందు మిస్సింగ్, తర్వాత ప్రత్యక్షం కావడమే మునిసిపల్ రాజకీయాలకు సెంటర్ గా మారింది. మొత్తం మీద ఇబ్రహీంపట్నం పొలిటికల్ గేమ్ మాంఛి రసవత్తరంగా మారుతోంది. ఈ ఆటలో ఫైనల్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందన్నది చూడాలి.