Off The Record: కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్.. బీఆర్ఎస్‌ అధినేత స్పందిస్తారా..?

  • బనకచర్ల కేంద్రంగా మొదట కాంగ్రెస్‌ని టార్గెట్‌ చేసిన బీఆర్‌ఎస్‌..
  • ప్రభుత్వం వైపు నుంచి రివర్స్‌ ఆటాక్‌తో రసవత్తరం..
  • అంతా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లేనని సీఎం రేవంత్‌ అటాక్‌..
  • అసెంబ్లీలో చర్చకు రమ్మంటూ కేసీఆర్‌కు సీఎం సవాల్‌..
  • సభలో కేసీఆర్‌తోనే తేల్చుకోవాలన్న ఆలోచనలో సర్కార్‌..
  • కేసీఆర్ అవగాహన ఏంటో చెప్పమంటున్న కాంగ్రెస్‌..
  • మాజీ సీఎంని ఎలాగైనా సభకు రప్పించాలన్న ప్లాన్‌ ఉందా?..
  • గత తప్పిదాలను ఎండగట్టే వ్యూహం..
  • కేసీఆర్‌ ఎందుకు.. మేం చాలంటున్న గులాబీ నేతలు..
  • కేసీఆర్‌ వస్తారా? కేటీఆర్‌, హరీష్‌కే బాధ్యలు అప్పగిస్తారా?..
  • ప్రభుత్వం దగ్గర ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బి ఉన్నాయా? ..
Kcr

Kcr

Off The Record: ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అయితే… తెలంగాణలో వ్యవహారం కాస్త డిఫరెంట్‌గా ఉందని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. మొదట ఈ ప్రాజెక్ట్‌ని బేస్‌ చేసుకుని…కాంగ్రెస్‌ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ వచ్చింది బీఆర్‌ఎస్‌. కానీ… ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి రివర్స్‌ అటాక్‌ మొదలవడంతో మేటర్‌ రసకందాయంలో పడిందని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో సమావేశం పెట్టింది సర్కార్‌. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ఒప్పందాలు…అప్పుడు ఏపీ ప్రభుత్వానికి జరిగిన మేలు లాంటి రకరకాల అంశాలను ఆ మీటింగ్‌లో ప్రస్తావించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో… రాయలసీమకి నీళ్ళు తరలించడం లాంటి అంశాలపై… ఏపీ మాజీ మంత్రి రోజా ఇంటి ముందు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోలు విడుదల చేశారు ముఖ్యమంత్రి. దానికి కొనసాగింపుగా… ఇటీవల ప్రతిపక్ష నేత కేసీఆర్‌కి సవాల్ విసిరారు సీఎం. బనకచర్ల ప్రాజెక్ట్‌ మీద చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరుస్తామని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే…కేసీఆర్‌ సభకు వచ్చి మాట్లాడాలని ఛాలెంజ్‌ చేశారాయన. బనకచర్ల ఎపిసోడ్‌పై… ఇప్పటి వరకు మాజీ మంత్రి హరీష్‌రావు మాత్రమే మాట్లాడుతున్నారు.

Read Also: Jagdeep Dhankhar: పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలి.. ఉపరాష్ట్రపతి మద్దతు..

అయితే… ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పెట్టి సభలో డైరెక్ట్‌గా కేసీఆర్‌తోనే తేల్చుకోవాలని భావిస్తోందట ప్రభుత్వం. నీళ్ళ గురించి, నదుల గురించి కేసీఆర్‌కి ఉన్నంత అవగాహన ఎవరికీ లేదని కేటీఆర్ అంటున్న క్రమంలో… బనకచర్ల ఎపిసోడ్‌ మాట్లాడేందుకు నేరుగా ఆయనే సభకు వస్తే మంచిదన్నది ప్రభుత్వ పెద్దల మాట. జగన్‌, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సమావేశాలు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు అనుమతి, గోదావరిలో నీటి లభ్యత…అలకేషన్ లాంటి అంశాలపై సభలో గట్టిగానే చర్చించాలని డిసైడయ్యారట సర్కార్‌ పెద్దలు. అయితే… ఇక్కడే ఇంకో ప్లాన్‌ కూడా ఉండి ఉండవచ్చంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిని ఎలాగైనా…. సభకు రప్పించాలన్నది కాంగ్రెస్‌ పెద్దల ఆలోచన అయిఉండవచ్చంటున్నారు.

Read Also: CM Revanth Reddy: పిలిస్తే పలికే నాయకుడు పీజేఆర్.. పేదవారికి అండగా నిలబడ్డాడు..

అందుకే…. కేసీఆర్‌ వచ్చి మాట్లాడాలని సీఎం రేవంత్‌ సవాల్ విసిరి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా… బనకచర్ల వ్యవహారంపై కేసీఆర్‌ మాట్లాడట లేదు. కాబట్టి నేరుగా సభలోకే వస్తే…. ఆయన సమక్షంలోనే…బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలతో పాటు… కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన తప్పిదాలను ఎండగట్టవచ్చన్న ప్రణాళిక ఉండి ఉండవచ్చంటున్నారు. అందుకే వచ్చేనెలలో అసెంబ్లీని సమావేశపరిచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే… సీఎం రేవంత్ సవాల్‌కి బీఆర్‌ఎస్‌ స్పందన డిఫరెంట్‌గా ఉందట. ఆ చర్చకు కేసీఆర్ ఎందుకు… మేమే వస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు గులాబీ నాయకులు. కానీ… ప్రభుత్వం మాత్రం…. ప్రాజెక్టులపై చర్చకు కేసీఆర్ రావాలనే ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో…. సీఎం రేవంత్ వేసిన గాలానికి గులాబీ బాస్‌ చిక్కుతారా..? లేక యధావిధిగా హరీష్, కేటీఆర్‌కు బాధ్యత అప్పగిస్తారా..? అన్నది సస్పెన్స్‌గా మారింది. అటు ప్రభుత్వం కూడా ప్లాన్‌ ఎ, ప్లాన్‌ బిలో ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ వస్తే ఒకలా, రాకుంటే మరోలా డీల్‌ చేయాలని డిసైడై… ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణ అసెంబ్లీలో బనకచర్ల ప్రాజెక్ట్‌ మీద హాట్‌ హాట్‌ చర్చ జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు.