Off The Record : కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. తన కుటుంబ సభ్యులు ఎవరూ రాజకీయాల్లోకి రారని, ఇకపై తాను కూడా ఎన్నికల్లో నిలబడబోనని నియోజకవర్గంలో జరిగిన ఓ మీటింగ్లో చెప్పారీ మాజీ మంత్రి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఊహించని మెజార్టీతో తనను గెలిపించారని, ఆ రుణం తీర్చుకోవటానికి ఇప్పుడు లోకల్గా అన్ని సమస్యలను పరిష్కరించటంపై దృష్టి పెట్టానని అన్నారాయన. ఈ వ్యాఖ్యల చుట్టూనే అధికార, ప్రతిపక్షాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.ఎమ్మెల్యే మాటల్ని ప్రతిపక్ష పార్టీ ఒకలా తీసుకుంటే…. అధికార కూటమిలో మాత్రం కాస్త డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు. ఇకపై తాను పోటీచేయబోనన్న కామినేని మాటల్ని వైసీపీ లైట్ తీసుకుంటోందట. ఆ….. ఆయన అంతేలే…. అలాగే మాట్లాడుతుంటారు, ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే చెప్పి మళ్లీ పోటీ చేశారు, సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నట్టు సమాచారం. అయితే… అధికార కూటమి పార్టీల మధ్య మాత్రం కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యల చుట్టూ పెద్ద చర్చే జరుగుతోందట. 2014 ఎన్నికల్లో కూటమి తరపున కామినేని శ్రీనివాస్ పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో టీడీపీ అభ్యర్థినినిలబెట్టగా ఓడిపోయాడు.
ఇక 2024లో తిరిగి పొత్తు కుదిరి కూటమి ఏర్పడటంతో… నేనున్నానంటూ మళ్ళీ తెర మీదికి వచ్చి పోటీ చేసి గెలిచారాయన. గత ఎన్నికల్లోనే పోటీ చేసే వాడిని కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో బరిలో దిగాల్సి వచ్చిందని ఇప్పుడు చెబుతున్నారు ఎమ్మెల్యే. అటు కామినేని గెలవడంతో ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా లేడు. ఆ పార్టీ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నటైంలో…వచ్చిన ప్రకటనతో తమ్ముళ్లలో ఉత్సాహం మొదలైందట. 2009లో కైకలూరు నుంచి టిడిపి అభ్యర్థి జయ మంగళ వెంకటరమణ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టికెట్ కామినేనికి వెళ్ళటంతో టీడీపీ ఇన్చార్జిగా కొనసాగారు జయమంగళ. 2019లో పొత్తు లేకపోవడంతో టీడీపీ తరపునే బరిలో దిగి ఓడిపోయారాయన. ఆ తర్వాత సైలెంట్ అవడం, 24లో కామినేని గెలవడంతో…. ప్రస్తుతం టీడీపీకి ఇన్చార్జి లేకుండా పోయాడు. దీంతో ప్రస్తుతం కైకలూరు టీడీపీ ఇబ్బందుల్లో ఉందని అంటున్నారు. మాకో ఇన్ఛార్జ్ కావాలని లోకల్ లీడర్స్ కోరటంతో… అధిష్టానం త్రీ మెన్ కమిటీని మాత్రమే ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో….ఈసారి పోటీ చేయబోనని కామినేని ప్రకటించడంతో… స్థానిక తెలుగుదేశం నేతల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయట. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ నుంచి టిడిపి పోటీ చేసేలా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఓ మహిళా నేత ఇప్పటికే ఈ దిశగా అధిష్టానం దగ్గర లాబీయింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొల్లేరు వాసులు మాట్లాడటం, తెలుగుదేశానికి చెందిన సర్పంచ్ ఒకరు ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయం వరకు పాద యాత్ర చేసేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది.స్థానికంగా బీజేపీకి సరైన నేతలు లేకపోవటంతో… టీడీపీ తరపున త్రీ మెన్ కమిటీ సభ్యులతో పాటు ఇంకొందరు నేతలు కూడా ఇక్కడ పాగా వేయటానికి పావులు కదుపుతున్నట్టు సమాచారం. మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కైకలూరు టీడీపీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.