Off The Record: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల వరుసగా వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు పార్టీ అధ్యక్షుడు జగన్. ఈ క్రమంలోనే తాజాగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం పెట్టారు.ఈ సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను వివరించి దిశానిర్దేశం చేశారాయన. అంతవరకు బాగానే ఉన్నా.. మీటింగ్ ప్రారంభంలో జగన్ చేసిన కామెంట్స్ చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిని
ఎవరికి నచ్చినట్టు వాళ్లు అన్వయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు పార్టీ లీడర్స్. ఈ ప్రచారం ప్రస్తుతం ప్రకాశం పాలిటిక్స్లో హీట్ పెంచుతోంది. జిల్లాలో పొలిటికల్ సిచ్యుయేషన్ను వివరిస్తున్న క్రమంలో… ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో కాస్త ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. ఈ సెగ్మెంట్కు వచ్చేసరికి అందరి మనసులో ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నది తనకు తెలుసునని అన్నారాయన. వాసన్న మళ్లీ పార్టీలోకి వస్తాడా అని అందరూ అనుకుంటున్నారని అంటూ… దానికి ముగింపు ఇవ్వకుండా అక్కడితో ఆపేయడంపై ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో పార్టీ జగన్ ఒక్కడిదే కాదని, వైఎస్సార్ని అభిమానించే ప్రతి ఒక్కరిదీ అనడంతో ఇంకా ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఇంతకీ బాలినేని వాసు విషయంలో జగన్ ఏం చెప్పదల్చుకున్నారు? ఆ పరంగా అసలేం జరుగుతోందంటూ రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్లో.
బాలినేని టాపిక్కు కొనసాగింపుగా మరో విషయం కూడా చెప్పారు జగన్. ఒంగోలులో అందరూ కలసికట్టుగా చుండూరి రవి అయితే బాగుంటుందని భావించారని, అందుకే ఆయన్ని ఇన్ఛార్జ్గా నియమించామని చెప్పుకొచ్చారు. ఏడాదిన్నర నుంచి రవి ఇన్ఛార్జ్ భాద్యతలు బాగానే నిర్వహిస్తున్నారంటూ కితాబిచ్చారాయన. ఆయనకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే జగన్ చేసిన ఈ కామెంట్స్ ఒంగోలు నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా మొత్తం రీ సౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తిరిగి ఫ్యాన్ కిందికి వస్తారన్న ప్రచారం ఇటీవల జోరుగా జరుగుతోంది. ఆ క్రమంలోనే జగన్ ఈ ప్రస్తావన తీసుకువచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఆయన దృష్టిలో ఈ అంశం లేకుంటే అసలు ప్రస్తావన తీసుకువచ్చి ఉండేవారే కాదని అభిప్రాయపడుతున్నారు కొందరు. బాలినేని పార్టీలోకి తిరిగి వస్తాడా అని అందరి మనసుల్లో క్వశ్చన్ మార్క్ ఉందని మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు ఆ సందేహాలకు మాత్రం తెరవేయలేదని, దాంతో.. తమ నాయకుడికి లైన్ క్లియర్ అవుతోందన్న ఇండికేషన్ వచ్చినట్టేనని ప్రచారం మొదలుపెట్టారు మాజీ మంత్రి సన్నిహితులు.
జగన్కు బాలినేనిపై సదభిప్రాయం ఉంది కాబట్టే.. ఆ టాపిక్ను ముగించకుండా అంతటితో వదిలేశారంటూ చెప్పుకొస్తున్నారు. కచ్చితంగా బాలినేని వైసీపీలోకి వచ్చే సమయం దగ్గరలోనే ఉందని కూడా చెబుతున్నారట కొందరు. అయితే ఇదే సమయంలో చుండూరి రవికి జగన్ ఆశీస్సులు ఉన్నాయని, తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసి బాలినేనికి చెక్ పెట్టారంటూ మాజీ మంత్రి వ్యతిరేక వర్గం కూడా ప్రచారం మొదలుపెట్టింది. ఇక ఇదే సమయంలో జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కూడా భవిష్యత్తులో మంచి స్దాయికి తీసుకువెళ్తానని జగన్ భరోసా ఇచ్చినట్టు తెలిసింది. జిల్లాలో శివప్రసాద్ రెడ్డి, నియోజకవర్గంలో రవి కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని చెప్పటం ద్వారా వారి స్దానాలను ఆయన సుస్దిరం చేశారని, కష్టకాలంలో పార్టీని వీడిన వారికి అవకాశం ఉండదంటూ మాట్లాడేసుకుంటున్నారు ఇంకొందరు.బాలినేని మనసు మార్చుకుని తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరతారా? లేక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దిగా చుండూరి రవినే ఉంటారా.. జిల్లా వైసీపీలో బాలినేని ప్లేస్ను బూచేపల్లి రీప్లేస్ చేస్తారా అనే ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానాలు రానప్పటికి వారి అనుచరులు, సన్నిహితులు మాత్రం ఎవరి యాంగిల్లో వారు ప్రచారాలు చేసుకోవడం మాత్రం ఆసక్తికరంగా మారింది.. పార్టీ అధినేత మనసులో ఏముంది..ప్రకాశం వైసీపీ పాలిటిక్స్ ఏ టర్న్ తీసుకుంటాయనేది చూడాలి.
