Site icon NTV Telugu

Off The Record: అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు స్వరం ఎందుకు వినిపించలేదు..?

Otr Ap Bjlp

Otr Ap Bjlp

Off The Record: ఏపీలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒకరు మంత్రి కూడా. అంతా కలిసి అసెంబ్లీ సమావేశాలకు ముందు చాలా మాట్లాడుకున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలతో పాటు ఇతర అంశాల మీద కూడా గట్టిగా రియాక్ట్‌ అవుదామని డిసైడ్‌ అయ్యారు. మనం కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి…. మిత్రపక్షాన్ని నొప్పించకుండానే… మన ఉనికి చాటుకుందామని నిర్ణయం తీసుకున్నారట. ప్రధానంగా… రాష్ట్రంలో మనం ఎవరికీ తోకలం కాదు, మనది ప్రజాపక్షం అని బయటికి చెప్పాలనుకున్నట్టు సమాచారం. అంతవరకు బాగానే ఉందిగానీ… ఆ తర్వాత ఏమైందన్నదే మిలియన్‌ డాలర్‌ క్వశ్చన్‌. బీజేఎల్పీలో మాట్లాడుకున్న మాటలన్నీ ఏమైపోయాయి? కాషాయ సభ్యులు అసెంబ్లీలో ఎందుకు సరిగా మాట్లాడలేకపోయారంటూ చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. ఇవి బడ్జెట్‌ సమావేశాలు కాబట్టి… సమస్యల గురించి తర్వాత చూద్దామని మనోళ్ళు అనుకున్నారా ఏంటి అంటూ… కమలం కార్యకర్తలే జోకులేసుకుంటున్నారట. ప్రజల పక్షంగా ఉండాలనుకున్నప్పుడు సభలో కనీసమాత్రమైనా స్పందించాలి కదా, మాట్లాడాలికదా…? కొంత మంది టీడీపీ సభ్యులే ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తున్నప్పుడు మనోళ్లు మౌనంగా ఉండాల్సిన అవసరం ఏంటి? అసలు వీళ్ళేమనుకుంటున్నారంటూ బీజేపీ వర్గాల్లో హాట్‌ హాట్‌ చర్చలే నడుస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో ఇంకో వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. టీడీపీ సభ్యులు మాట్లాడారంటే వాళ్ళ లెక్కలు వేరుగా ఉంటాయి. వాళ్ళలో వాళ్లు ఎన్నయినా అనుకుంటారు, ఏమైనా మాట్లాడి తర్వాత ప్యాచప్‌ చేసుకుంటారు. మనం పొరుగింటి వాళ్ళం కదా…., మన లిమిట్స్‌ ఏవో తెలుసుకుని మెలగాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ శాసనసభ్యులు సైలెంట్‌ అయిఉండవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. కూటమి ధర్మం వాళ్ళ నోళ్లు కట్టేసి ఉండవచ్చన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మరో 15 ఏళ్ళ పాటు కూటమిలో ఎలాంటి గొడవ లేకుండా కలిసుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ జనసేనాని పవన్‌కళ్యాణ్‌ చెబుతున్న మాటల్ని వీళ్లు బాగా ఒంటబట్టించుకున్నట్టున్నారా? అందుకే కామ్‌గా ఉన్నారా అంటూ ఇంకొందరు ప్రశ్నించుకుంటున్నారు. సభకు వెళ్ళామా, ప్రతిపాదించిన ప్రశ్న ఏదైనా వస్తే మాట్లాడామా, అదీకూడా లేకుంటే సపోర్ట్‌ పేరిట సైలెంట్‌గా ఉన్నామా అన్నట్టుండి చర్చల్ని వదిలేస్తే… మన ఉనికి తెలియాలి కదా… అంటున్నారు ఏపీ బీజేపీ కార్యకర్తలు.

రాబోయే మూడేళ్ళు కూడా వీళ్ళు ఇలాగే ఉంటారా లేక నోరు తెరిచి చర్చల్లో పాల్గొంటారా అన్న డౌట్స్‌ కూడా కేడర్‌లో పెరుగుతున్నాయట. గతంలో ప్రశ్నలతో, చర్చలతో హోరెత్తించిన విష్ణుకుమార్ రాజు కామ్ అవడంపై సొంత నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కమ్మగా ఉందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం, వివరణలు ఇచ్చుకోవాల్సిరావడంతో మరో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సైలెంట్‌ అయినట్టు చెప్పుకుంటున్నారు. అయితే… ఏం మాట్లాడబోయి ఏం మాట్లాడితే ఎలాంటి సమస్య వస్తుందోనన్న భయం కూడా ఉండి ఉండవచ్చన్నది ఇంకో వెర్షన్‌. ఓవరాల్‌గా ఈసారి అసెంబ్లీలో బీజేపీ సభ్యులు కామ్‌గా ఉండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ వ్యవహారంపై పార్టీ కేడర్‌ కూడా కాస్త అసహనంగా ఉందట. ఎవరి కారణాలు వారికి ఉండవచ్చు, సంయమనం పాటిస్తుండవచ్చుగాని… కనీస ఉనికి చాటుకోకుంటే ఎలాగన్నది కార్యకర్తల ప్రశ్న.

Exit mobile version