మంత్రి కావాలని అనుకున్న ఆ ఎమ్మెల్యే ఆశలు ఆడియాసలు అయ్యాయి. రెండుసార్లు ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినా.. చివరిక్షణంలో ఛాన్స్ మిస్. దీనికంతటికీ ఆయన రాజకీయ గురువే కారణమని చెవులు కొరుక్కుంటున్నారట. శిష్యుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని టాక్. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎవరా గురువు?
చివరి వరకు రేస్లో.. లాస్ట్లో ఛాన్స్ మిస్ కోనసీమ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ముమ్మిడివరం. ఇక్కడి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు పొన్నాడ సతీష్కుమార్. మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లిన టైమ్లో.. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన పొన్నాడ సతీష్కు మినిస్టర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. పిల్లి బోస్ రాజ్యసభకు వెళ్లడంతో ఆయన ఖాళీ చేసిన మంత్రి పదవిని అదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్కు ఇచ్చారు. మోపిదేవి స్థానంలో పొన్నాడ పేరు పరిశీలనకు వచ్చినా ముమ్మిడివరం నియోజకవర్గం.. రామచంద్రపురం పక్కపక్కనే కావడంతో సతీష్కు మంత్రి పదవి మిస్ అయ్యింది. ఈసారి తప్పకుండా ఛాన్స్ ఇస్తారని మరోసారి ఎమ్మెల్యే పేరు చర్చల్లోకి వచ్చింది. చివరి వరకు ఆయన పేరు రేస్లో ఉంది కూడా. ఏమైందో ఏమో లాస్ట్మినిట్ మళ్లీ పొన్నాడ పేరు మిస్. దీంతో పొన్నాడు సతీష్కు మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏంటనే చర్చ జోరందుకుంది.
మల్లాడి అడ్డుపడ్డారా? మంత్రివర్గాన్ని సమూలంగా మార్చేసి.. కొత్తవారిని తీసుకుంటారని అనుకున్నా.. కేబినెట్లో పాత ముఖాలే ఎక్కువగా ఉండటంతో అమాత్య పదవికి దూరం అయ్యారనేది ఒక వాదన. పైగా తన వంతు ప్రయత్నాలు సతీష్ చేయలేదనే కామెంట్సూ వినిపిస్తున్నాయి. దీంతో అనుచరులు తీవ్ర నిరాశలో పడిపోయారు. ఇదే సమయంలో పొన్నాడకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం అంటూ.. మరో చర్చ కూడా జరుగుతోంది. పొన్నాడకు రాజకీయ గురువు.. పుదుచ్చేరి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావేనని ప్రచారం నడుస్తోంది.
యానాంలో ఓటమికి కసి తీర్చుకున్నారా? యానాం ఎన్నికల్లో మల్లాడికి వ్యతిరేకంగా పొన్నాడ ప్రచారం చేసి అశోక్ ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించారనే అనుమానాలు ఉన్నాయట. అప్పటి నుంచి పొన్నాడకు ఆయన రాజకీయ గురువు మల్లాడికి మధ్య దూరం పెరిగిందనే వాదన ఉంది. ఒకదశలో మల్లాడి ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తానని ప్రకటించారు. సీఎం జగన్తో భేటీ అయ్యి టీటీడీలో సభ్యుడిగా పదవీ దక్కించుకున్నారు. యానాం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మల్లాడి.. ఎమ్మెల్యే పొన్నాడ ఆశలకు చెక్ పెట్టారని సందేహిస్తున్నారట. ఆ విధంగా యానాంలో ఓటమికి కసి తీర్చుకున్నట్టు .. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు చర్చించుకుంటున్నారు.
పొన్నాడ వర్గీయులు గుర్రు మంత్రివర్గం కూర్పుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలోనే పొన్నాడకు కేబినెట్లో చోటు దక్కబోదని మల్లాడి వర్గం ప్రచారం చేసిందట. చివరకు అదే నిజమైంది. దీంతో ఎమ్మెల్యే పొన్నాడ వర్గీయులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. నిజంగా మల్లాడి చెబితేనే సీఎం జగన్ ఎమ్మెల్యే పొన్నాడను దూరం పెట్టారా? అన్నది కొందరి ప్రశ్న. కారణం ఏదైనా మంత్రి పదవికి పొన్నాడ సతీష్ దూరంగా ఉండిపోయారు. మల్లాడి వర్గీయులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారట.