హుజురాబాద్లో ఈటల రాజేందర్ ఏక్ నిరంజన్గా మిగిలిపోయారా? ఇక చాలు అని బీజేపీ నేతలకు చెప్పేశారా? పోలింగ్కు మిగిలిన మూడు రోజులు ఆయన ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారు? ఈటలలో వచ్చిన మార్పేంటి? లెట్స్ వాచ్..!
బీజేపీ వారిని సర్దుకోవాలని చెప్పారా?
హుజురాబాద్లో ఈ నెల 30 పోలింగ్. 72 గంటల ముందే ప్రచారానికి ఫుల్స్టాప్. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చాక.. ఈటల నామినేషన్ వేశాక.. ప్రచారం స్పీడ్ పెంచాయి బీజేపీ శ్రేణులు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఇంఛార్జ్ తరుణ్చుగ్ మొదలుకొని కాషాయదండు మొత్తం అక్కడే తిష్ట వేసింది. బూత్ కమిటీలు.. ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి మాట్లాడం వంటి సంప్రదాయ పద్ధతుల్లో బీజేపీ శ్రేణులు తిరిగేశాయి కూడా. ఇదంతా బాగానే ఉన్నా.. అభ్యర్థి ఈటల రాజేందర్లో ఎక్కడో అనుమానం వెంటాడినట్టు సమాచారం. అందుకే ప్రచారం ముగియగానే బీజేపీ వాళ్లను సర్దుకోవాలని చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ 72 గంటలు సొంత కేడర్నే ఈటల నమ్ముకోనున్నారా?
పోలింగ్కు మిగిలి ఉన్న 72 గంటలు తానే చూసుకోవాలని ఈటల రాజేందర్ డిసైడ్ అయినట్టు సమాచారం. బూత్ కమిటీలు.. పార్టీ నేతలు చేసింది ఇక చాలు అని చెప్పేశారా? అయితే ఎందుకు అన్నదే ఇప్పుడు ప్రశ్న. తనది కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకొనే ఈటల రాజేందర్.. రాజకీయ పరిస్థితుల కారణంగా బీజేపీలో చేరారు. సుదీర్ఘకాలం టీఆర్ఎస్లో ఉండటం వల్లో ఏమో బీజేపీలో చేరినా అక్కడ గాలి ఇంకా వంటబట్టలేని తెలుస్తోంది. తనకు రాజకీయంగా జీవన్మరణ సమస్యలాంటి హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ నేతలపై ఆధారపడితే మొదటికే మోసం వస్తుందని అనుకున్నారో ఏమో.. సొంత కేడర్ను నమ్ముకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రచారం ముగిసిన తర్వాత కీలకమైన ఈ కాలంలో బీజేపీని నమ్ముకుంటే నష్టం జరగొచ్చని ఆయన అనుమానించారేమో అని చర్చ జరుగుతోంది.
బీజేపీ అభ్యర్థిగా ఫోకస్ కావడానికి ఈటల ఉత్సాహం చూపించలేదా?
హుజురాబాద్లో మొదటి నుంచి ఈటల రాజేందర్ సెంటిమెంట్ను నమ్ముకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్పైనే ఎక్కువ విశ్వాసం ఉంచారట. ఈ ఉపఎన్నికలో మొదటి నుంచి బీజేపీ అభ్యర్థిగా కంటే ఈటల రాజేందర్గానే ఫోకస్ కావడానికి ప్రాధాన్యం ఇచ్చారు మాజీ మంత్రి. ఉపపోరు ఈటల వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా వేడి కొనసాగించేందుకు ఆయన అనుచరులు మొగ్గు చూపారు. పైగా ప్రచారం ముగిశాక.. పోలింగ్ మొదలయ్యే వరకు డబ్బుల పంపిణీని కీలకంగా భావిస్తారు. ఈ అంశంలోనూ పార్టీ వారిని కాకుండా సొంతవారిపైనే ఈటల ఎక్కువ నమ్మకం ఉంచినట్టు టాక్. ఉపఎన్నిక ప్రచారం ఎంత గ్రాండ్గా ముగించినా.. చివరిక్షణంలో మాత్రం ఈటల ఏక్నిరంజన్గా మారినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈటల తీసుకున్న ఈ జాగ్రత్త పోలింగ్ వరకేనా.. ఆ తర్వాత కూడా కొనసాగిస్తారా అన్నది చూడాలి.