రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించిన నేతలకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లా అధ్యక్షులు మీరే.. పార్టీ బాధ్యతలు మీవే.. నడిపించేది.. గెలిపించేది మీరే అనే క్లారిటీ ఇచ్చారు. మంత్రులకంటే మీరే ఎక్కువ అని కూడా సాక్షాత్తూ సీఎం చెప్పారు కూడా. అయితే ఇది పదవి అనుకోవాలా.. లేక కొత్త సమస్యలు తలకెత్తుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడ్డారు పార్టీ పదవుల్లోకి వచ్చిన నేతలు. కొందరు నాయకులు మాత్రం తమ ముందున్న సవాళ్లను లెక్క చేయకుండా ఉత్సాహంగా పార్టీ పగ్గాలు అందుకున్నారు. అలాంటి వారిలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఒకరు. సీఎం జగన్తో మొదటి నుంచి నడుస్తున్న నేత. బీసీ సామాజికవర్గం కావడంతో ఆ కోటాలో రెండుసార్లు మంత్రి పదవి ఆశించారు. అధిష్ఠానం కరుణించలేదు. దీంతో కాపు అనుచరులు నిరసనలు.. ధర్నాలు.. బంద్లు చేశారు. చివరకు సీఎం జగన్తోపాటు పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన తర్వాత మెత్తపడ్డారు కాపు రామచంద్రారెడ్డి. ప్రస్తుతం అనంతపురం జిల్లా వైసీపీ బాధ్యతలు ఆయనకే ఇచ్చారు.
మంత్రి పదవి రాలేదన్న నిరాశలో ఉన్న కాపు.. పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వగానే భారీ ఊరేగింపు నిర్వహించారు. అదీ మంత్రి పదవి వచ్చినా అంత గ్రాండ్గా ఊరేగింపు ఉండదేమో అనే స్థాయిలో జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. కానీ జిల్లాను కాపు కాయాలంటే అంత ఈజీ కాదన్న విషయం గుర్తెరిగినట్టు లేదు. ఎందుకంటే.. వైసీపీలో పైకి అంతా ఒకటిలా కనిపిస్తున్నా.. లోలోన మాత్రం లావాలా అంతర్గత విభేదాలు రగులుతున్నాయి.
కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్కు వ్యతిరేకంగా మూడేళ్లుగా పార్టీ నేతలు గ్రూపులు కట్టారు. అధికారపార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలే తిరుగుబాటు ఎగురవేసి.. అధిష్ఠానం వరకు ఫిర్యాదులు తీసుకెళ్లారు. చాలాసార్లు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. బహిరంగంగా ప్రెస్మీట్స్ నిర్వహించి మంత్రి తీరును ఎండగట్టారు. తమ సహకారంతో ఎమ్మెల్యే అయ్యి తమపైనే కేసులు పెట్టిస్తున్నారని.. ఉషశ్రీచరణ్కు మంత్రి పదవి వచ్చేవరకు ఫిర్యాదులు వెళ్లాయి. కల్యాణదుర్గంలో అసమ్మతివర్గాన్ని శాంతింప జేయడం, ఉషాశ్రీచరణ్ను కలుపుకొని రాజకీయలు చేసేలా చొరవ తీసుకోవడం.. కాపు ముందున్న ఫస్ట్ టార్గెట్. దీనిలో ఆయన ఎంత వరకు సఫలం అవుతారన్నదే ప్రశ్న. ఇక ఎంపీ రంగయ్యకు, మంత్రి ఉషశ్రీచరణ్కు పొసగడం లేదు. బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం తప్ప వీళ్ల మధ్య అన్నిరకాల విభేదాలు ఉన్నాయి.
తాడిపత్రి నియోజకవర్గంలో చాపకింద నీరులా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మరో గ్రూప్ రెడీ అవుతోంది. పక్కనే ఉన్న శింగనమల నియోజకవర్గంలోనూ సేమ్ సీన్. ఇక్కడ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డికి, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కోల్డ్వార్ నడుస్తోంది. యల్లనూరు, పుట్లూరు మండలాల్లో ఆధిపత్యం కోసం ఈ రెండువర్గాల మధ్య ఆధిపత్యం నడుస్తోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఇది సొంత నియోజకవర్గం కాకపోయినా.. ఆయన స్వగ్రామం ఆయనకు పట్టున్న మండలాలివి. అందుకే అక్కడ తన మాట నెగ్గాలని పట్టుదలతో ఉన్నారు. తన నియోజకవర్గంలో పక్క ఎమ్మెల్యే పెత్తనం ఏంటన్నది పద్మావతి ప్రశ్న. ఈ మండలాల్లోనే ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గంతోపాటు శింగనమల ఎమ్మెల్యేకు బలమైన మరోవర్గం కూడా ఉంది. ఈ గ్రూపులన్నీ రోజూ ఏదో విషయంలో ఫైట్ చేసుకుంటూనే ఉన్నాయి.
ఇక్కడ కొంతలో కొంత బెటర్ ఏంటంటే.. ఒక కళ్యాణదుర్గం తప్ప శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో గ్రూపులు ఉన్నా అధిష్ఠానం గీసిన లైన్ దాటే పరిస్థితి ఎవరికీ లేదు. హైకమాండ్ను ధిక్కరించకున్నా.. స్థానికంగా ఎమ్మెల్యేలకు వ్యతిరేకవర్గాలు అలాగే ఉండటంతో ఎన్నికల్లో అవి ఎవర్ని దెబ్బతీస్తాయో అన్న ఆందోళన కేడర్లో ఉంది. అయినప్పటికీ వీరిందర్నీ ఏకతాటిపైకి తీసుకుని రావడం కాపు రామచంద్రారెడ్డికి అంత ఈజీ కాదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.