విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. అలాంటి చోట టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఎవరి నోట విన్నా ఆ మహిళా నేతలే పేర్లే చర్చల్లో ఉంటున్నాయి. విజయనగరంపై పట్టుకోసం అదితి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గట్టిగా పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది.
2019లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి అశోక్ వర్గానికి.. గీత వర్గానికి అస్సలు పడటం లేదు. అదితి.. గీతల మధ్య ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. టీడీపీ ఆఫీసు అశోక్ బంగ్లాలో ఉండటంతో.. విజయనగరంలోనే మరోచోట పార్టీ ఆఫీస్ తెరిచి చర్చగా మారారు గీత. ఆ వివాదం పార్టీ పెద్దల వరకు వెళ్లింది. అయినా వెనక్కి తగ్గలేదు మాజీ ఎమ్మెల్యే.
2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన అదితి.. కరోనా టైమ్లో బయటకు రాలేదు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మాత్రం తళుక్కుమన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు చంద్రబాబుకు అదితి చెప్పారని ప్రచారం జరిగింది. కానీ.. విజయనగరంలో టీడీపీ కార్యక్రమాలు చూసుకోవాలని అధినేత చెప్పారట. దాంతో నియోజకవర్గంలో అదితికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీలో ఆమె అనుచరులు ప్రచారం మొదలుపెట్టేశారు.
జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్న మీసాల గీత.. ఎన్నికల నాటికి రాజకీయాల్లో మార్పులు వస్తాయనే లెక్కలతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య విజయనగరం నీదా నాదా అనేట్టు ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యేకు మనసులో ఎక్కడో డౌట్ తేడా కొడుతోందట. కానీ అదేమీ బయటపడకుండా 2024 ఎన్నికలే లక్ష్యంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు గీత. ప్రస్తుతంఉన్న పరిస్థితుల్లో రెండు వర్గాలు కలిసి నడవకపోతే ప్రత్యర్థులు లబ్ధి పొందే ప్రమాదం ఉందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. ఈ విషయం తెలిసినా రెండు వర్గాలు ప్రస్తుతం కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. తండ్రి చాటు తనయగా కాకుండా అదితి సొంతంగా రాజకీయాలు చేస్తే చూడాలని ఉన్నట్టు సెటైర్లు వేస్తోంది మాజీ ఎమ్మెల్యే వర్గం. పార్టీ పెద్దలు కూడా ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నం చేయడం లేదు. అందుకే రానున్న రోజుల్లో విజయనగరం టీడీపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. మరి విజయనగరం టీడీపీలో సిగపట్లకు ఎండ్కార్డు పడుతుందో లేదో చూడాలి.