సీఎం జగన్ కుప్పంపై ఫోకస్ పెట్టారు. కొడితే కుంభస్థలమే కొట్టాలనుకుంటున్నారు. వారిని.. వీరిని ఓడిస్తే మజా ఏం అనుకున్నారో ఏమో.. ఏకంగా తన ప్రధాన ప్రత్యర్థికే గురిపెట్టారు. గురంటే ఒట్టి గురి కాదు.. గట్టిగానే. అభివృద్ధి పనులకు 62 కోట్లు కేటాయించిన జగన్.. వాటి శంకుస్థాపనతోపాటు మూడో విడత చేయూత నిధులు విడుదల సభ కుప్పంలోనే పెట్టారు. కిరణ్కుమార్రెడ్డి తర్వాత కుప్పంలో అడుగుపెడుతున్న సీఎం జగనే. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హైఓల్టేజ్ క్రియేట్ చేస్తోంది.
కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్గా ఇప్పటి వరకు ఏ పార్టీ అధినేత పెట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే గతంలో ఉమ్మడి రాష్టాల సీఎంగా పనిచేసినా వైఎస్ రాజశేఖరరెడ్డి కుప్పానికి రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా ప్రారంభోత్సవాలకే పరిమితం అయ్యారే తప్ప రాజకీయం చేయలేదు. చంద్రబాబును ఓడించాలనే పట్టుదలకు పోలేదు. ఎందుకంటే అది చంద్రబాబు అడ్డా.1955 నుంచి టీడీపీ ఆవిర్భవించే వరకు జరిగిన 6 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లే గెలిచింది. టీడీపీ ఎంట్రీ తర్వాత జరిగిన 8 ఎన్నికలలో అన్నిసార్లూ ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అందులో 1989 నుంచి చంద్రబాబు గెలుస్తూనే ఉన్నారు. ఎంతో సులువుగా కుప్పంలో విజయం సాధిస్తూ వస్తున్న చంద్రబాబుకు గత ఎన్నికల నుంచి పరిస్థితి మారింది. మొదటి రెండు రౌండ్స్లో షాక్ ఇచ్చిన వైసీపీ.. ఆ తర్వాత పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం కోటలో పార్టీ జెండా ఎగరేసింది. దీంతో కుప్పంలో పూర్వ వైభవం కోసం చెమటోడ్చుస్తున్నారు బాబు. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో చెలరేగిన హింసాత్మక ఘటనలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. తన సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబు రోడ్డుపై కూర్చుని నిరసన దిగాల్సిన పరిస్థితులు తలెత్తాయి. బాబు పర్యటన సందర్భంగా రెండు రోజులుపాటు కుప్పంలో జరిగిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. పదుల సంఖ్యలో టిడిపి, వైసిపి నేతలపై కేసులు నమోదయ్యాయి. ఆ ఘటన తర్వాత కూడా కుప్పంలో పరిస్థితి సద్దుమణగలేదు.
కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రయత్నాలేవీ చేయలేదు. మొదటి నుంచి ప్రజలు ఎక్కువగా యాంటీ కాంగ్రెస్గానే ఉన్నారు. అయితే వైసీపీ ఆవిర్బావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ తగ్గడం మొదలు పెట్టింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 47 వేల పైచిలుకు మెజారిటీ సాధించగా.. 2019 ఎన్నికల్లో 30 వేల ఆధిక్యతే వచ్చింది. ఇది వైసీపీకి ఉత్సాహం నింపింది. ఇంకాస్త ట్రై చేస్తే బాబును ఓడించడం ఈజీ అనే ఆలోచన మొదలైంది. 2014లో వైసీపీకి 55 వేల ఓట్లు.. 2019లో 69 వేల ఓట్లు పడ్డాయి. కుప్పంను టీడీపీకి కంచుకోటగా మార్చిన చంద్రబాబుపై పోటీ చేసి 50వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న తొలి అభ్యర్థి కూడా చంద్రమౌళే. దీనికి తోడు చంద్రబాబుకు విద్యార్ధి దశ నుంచి చీరకాల రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆపరేషన్ కుప్పంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబుపై పోటీ చేసి ఓడిన చంద్రమౌళి కుమారుడు భరత్.. మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాలకు చక్కగా ఉపయోగపడ్డారు. భరత్ ఎమ్మెల్సీగా కుప్పం వైసీపీ ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్నారు కూడా. ఇప్పటి వరకు రాజకీయ పరమైన ఎత్తుగడలతో పట్టు కొనసాగిస్తున్న వైసీపీ.. ఇక అభివృద్ధి పనుల ద్వారా కుప్పం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నెల 22న సీఎం జగన్ కుప్పంలో పర్యటించబోతున్నారు.
2019 ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత హోదాలో జగన్ చివరిసారిగా కుప్పం వచ్చారు. ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు చంద్రబాబు అడ్డాలో తొలిసారి సీఎం హోదాలో జగన్ అడుగు పెట్టబోతున్నారు. దీంతో కుప్పంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. కుప్పం పట్టణ అభివృద్ధికి ఇటీవలే సీఎం 62 కోట్ల నిధులు కేటాయించారు. వాటికి సంబంధించిన పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అలాగే మూడో విడత చేయూత పథకం నిధులను కుప్పంలోనే విడుదల చేయబోతున్నారు సీఎం జగన్.
మొన్నటి చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా తలెత్తిన పరిణామాల తర్వాత.. ఇంత సడెన్గా సీఎం జగన్ రానుండటం హాట్ టాపిక్గా మారింది. వైసీపీ శ్రేణులు సీఎం జగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 22న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేయాలన్నది వైసీపీ ప్లాన్. మంత్రి పెద్దిరెడ్డి ఈ ఏర్పాట్లలో తలమూనకలై ఉన్నారు కూడా. అందుకే 22న జరిగే కార్యక్రమం రాష్ట్రంలో హైఓల్టేజ్ క్రియేట్ చేస్తోంది.