OTR: ఆ మాజీ మంత్రులకు జనసేన కండువాలు కప్పే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయా? అందుకోసం మరో ఎక్స్ మినిస్టర్ గట్టిగా పావులు కదుపుతున్నారా? ఒక ఉమ్మడి జిల్లా పొలిటికల్ ముఖ చిత్రాన్ని మార్చేసే ట్రయల్స్ సీరియస్గా నడుస్తున్నాయా? పార్టీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా గ్లాస్ అధిష్టానం ఆ విషయంపై దృష్టి పెట్టిందా? ఏ జిల్లాలో నడుస్తోందా వ్యవహారం? సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంశాల గురించి ఇప్పుడు ఓ లుక్కేద్దాం..
సొంత టీమ్ కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టి ప్రయత్నాలు
నిజానికి.. జనసేనలో చేరి చాన్నాళ్ళు సైలెంట్గా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవలే పూర్తిస్థాయి స్వింగ్లోకి వచ్చారు. ఇక అదే ఊపుతో.. పార్టీలో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారట. మరీ ముఖ్యంగా సొంత జిల్లా ఉమ్మడి ప్రకాశంలో తన సొంత, బలమైన టీమ్ను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీలో ఉన్నప్పటి మాదిరిగానే.. ఇప్పుడు కూడా అదే నెట్వర్క్ను జనసేనలో సైతం సెట్ చేసుకునేందుకు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రస్తుతం వైసీపీకి దూరంగా, సైలెంట్గా ఉన్న సీనియర్స్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కీలక నేతలైన మానుగుంట మహీధర్ రెడ్డి, శిద్దా రాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్, మద్దిశెట్టి వేణుగోపాల్కు టచ్లోకి వెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మహీధర్రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే బాలినేని, మహీధర్రెడ్డి మధ్య ఇప్పటికే రాజకీయ విభేదాలు ఉన్నాయి. గతంలో పరస్పరం బహిరంగ విమర్శలు కూడా చేసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న మహీధర్రెడ్డి.. ఈసారి మాత్రం బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు.
వైసీపీకి దూరంగా, సైలెంట్గా ఉన్నవాళ్ళ మీద దృష్టి
అయితే.. ఇప్పుడాయన పాత విభేదాలు మర్చిపోయి బాలినేనితో కలిసి నడవడం అంత సులువువేనా అన్న అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అదే సమయంలో అలా డౌట్పడ్డవాళ్ళే.. రాజకీయాల్లో ఎప్పుడేమైనా జరగొచ్చు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ టైం ఉన్నందున ఇంత ముందే పార్టీ మార్పుపై మానుగుంట నిర్ణయం తీసుకుంటారా అన్నది ఇంకో క్వశ్చన్. ఈ జాబితాలో నిజంగా ఇప్పటికిప్పుడు జనసేనలో చేరే అవకాశాలు ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది శిద్దా రాఘవరావేనన్నది జిల్లా రాజకీయ వర్గాల అభిప్రాయం. ఆయనకు బాలినేనితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న శిద్దా.. ఫలితాల తర్వాత వైసీపీకి రాజీనామా చేసి ప్రస్తుతం పొలిటికల్ ఇనాక్టివ్ మోడ్లో ఉన్నారు. 2014 – 19 మధ్య టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన రాఘవరావు.. తిరిగి టీడీపీ గూటికి వెళ్తారని ఆ మధ్య ప్రచారం జరిగినా.. అడుగు ముందుకు పడలేదు. ఈ క్రమంలో ఆయనతో బాలినేని సంప్రదింపులు జరిపే అవకాశం ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎక్కడో ఉండాల్సిన శిద్దా.. అనాలోచిత నిర్ణయాల వల్లే ఇప్పుడు అయోమయంలో పడ్డారని, ఈసారి ఏ నిర్ణయం తీసుకున్నా.. ఇక రాజకీయంగా వెనక్కు తిరిగి చూసుకునేలా ఉండక పోవచ్చని అంటున్నారు ఆయన సన్నిహితులు.
మానుగుంట, శిద్దా, ఆమంచి, మద్దిశెట్టి వేణుగోపాల్పై ఫోకస్
ఇక మరో నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. పార్టీ మారడాలు, అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకుంటారు.. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి కాంగ్రెస్లో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అయితే బాలినేని, ఆమంచి మధ్య రాజకీయంగా అంత సఖ్యత లేదని చెబుతారు. అయినా ఆమంచి విషయంలో చివరి నిమిషం వరకు ఏదీ చెప్పలేమన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. అందుకే ఆయన పేరు కూడా ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. ఒకవేళ ఆయన జనసేనలోకి వెళ్ళినా… నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మాట్లాడి చేరవచ్చుగాని, వయా బాలినేని ఉండకపోవచ్చన్నది ఇంకో వెర్షన్. ఇదే జాబితాలో దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ దక్కక సైలెంట్ అయిపోయి తన వ్యక్తిగత పనులకే పరిమితం అయ్యారాయన. ఒకవేళ ఆయన కోసం బాలినేని ప్రయత్నించినా… ఎలక్షన్స్కు ఇంకా మూడేళ్ల సమయం ఉందికాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటారా? లేదా అన్నది చూడాలంటున్నారు సన్నిహితులు. పరిస్థితులను గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది ఆయన వర్గం.
మొత్తం మీద ఈ నలుగురు నాయకులు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో బాలినేని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్లాస్ కండువా కప్పి పార్టీలో కూడా తన పరపతి పెంచుకోవాలన్న పట్టుదలగా ఉన్నారట. దీంతో… ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రకాశం జనసేన పాలిటిక్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి ఈ నలుగురి అభిప్రాయాలు ఎలాఉన్నా… ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపితే… పాత విభేదాలను పక్కన పెట్టవచ్చన్న వాదన సైతం ఉంది. దీంతో ఫైనల్గా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి ప్రకాశం రాజకీయ వర్గాలు.

