నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన అనిల్ కుమార్ యాదవ్ అనూహ్యంగా జగన్ మొదటి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. సీనియర్ నేతలు ఎందరో ఉన్నా అనిల్ కుమార్కు జగన్ అవకాశం ఇచ్చారు. కీలకమైన భారీ నీటిపారుదల శాఖకు మంత్రి అయ్యారు. మూడేళ్ల సమయంలో అనిల్ తనదైన శైలిలో కొనసాగారు. గత నెలలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో సర్వేపల్లి ఎంఎల్ఏగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానం దక్కింది. అనిల్ కుమార్ మాజీ అయ్యారు. మరుసటి రోజే కాకాణిపై అనిల్ కుమార్ పరోక్షంగా వ్యంగాస్త్రాలు సంధించారు. తాను మంత్రిగా ఉన్నపుడు ఎంత సహకారం అందించారో అంతకు రెట్టింపు సహకారం అందిస్తామని అన్నారు. అప్పటి నుంచి కాకాణి..అనిల్ కుమార్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. మంత్రిగా ప్రమాణం చేసిన కాకాణికి శుభాకాంక్షలు తెలుపుతూ నెల్లూరు నగరంలో వేసిన ఫ్లెక్సీలు చించేయడం..హోర్డింగ్స్ తొలగించడం పెద్ద దుమారాన్ని రేపింది. మొత్తం వ్యవహారం రచ్చరచ్చ అయ్యి వ్యవహారం తాడేపల్లికి చేరింది. అక్కడ ఏం జరిగిందో ఏమో అనిల్ సైలెంట్ అయ్యారు. కానీ..ప్రభుత్వ..పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
మంత్రిగా నెల్లూరుకు కాకాణి వస్తున్న రోజునే నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ఏర్పాటు చేయడం వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఇరువురూ ఎవరి పాటికి వారు కార్యక్రమాలు నిర్వహించుకోవాలని విమర్శలు చేసుకోవద్దని సీనియర్ నేతలు సూచించారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఇరువురు నేతలను పిలిచి పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించవద్దని సూచించారు. కలిసికట్టుగా పని చేసి వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కానీ ముఖ్యమంత్రి సూచించిన విధంగా కాకుండా ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి వచ్చిన తరువాత జిల్లాలోని ప్రముఖ నేతలను కలుస్తున్న క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి కాకాణి వెళ్లి కలిశారు. ఇక ఇద్దరి మధ్య విభేదాలు ఉండబోవని అందరూ భావించారు. కానీ అనిల్ జిల్లాలో జరుగుతున్న పార్టీ..ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జిల్లా నీటిపారుదల సలహా బోర్డు…జిల్లా సమీక్ష సమావేశాలకు అనిల్ హాజరు కాలేదు.
మరోవైపు…జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు వచ్చినపుడు పార్టీ జూనియర్..సీనియర్ నేతలు ఆయనను కలిసి అభినందనలు చెప్పారు. అనిల్ కుమార్ మాత్రం వేమిరెడ్డిని కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేనా…జిల్లా ఇంచార్జ్..రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు..నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పర్యటించినా అనిల్ కనిపించలేదు. జిల్లాలో పార్టీ పరిస్థితిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశానికి కూడా ఆయన గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో జిల్లాలో అభివృద్ధిపై జరిగిన మరో సమీక్షా సమావేశానికి కూడా అనిల్ రాలేదు. ఇలా ప్రతి కార్యక్రమానికి దూరంగా ఉంటుండటంతో అనిల్ భవిష్యత్లో ఏ విధంగా వ్యవహరిస్తారోనని పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ చెప్పినా అనిల్ కుమార్ తీరులో మార్పు రాలేదని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అనిల్ ఏ పంథా అనుసరిస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మంత్రి పదవి పోవటాన్ని అనిల్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. ఆయనతో పాటు మాజీలైన 13 మంది పార్టీ నిర్దేశించినట్లు ఎవరి పనులు వారు చేసుకుంటుంటే..అనిల్ మాత్రం టచ్ మీ నాట్ అన్నట్లు ఉంటున్నారు. మంత్రి పదవి పవర్ చూసిన అనిల్ ఇప్పుడు అది లేకుండా లీడర్ కాలేకపోతున్నారా?అనేలా ఆయన ప్రవర్తన ఉంటోందట. మాజీ అయ్యాక పెట్టిన కార్యకర్తల సమావేశంలో మళ్లీ మంత్రిని అవుతా..మళ్లీ మంత్రిని అవుతా అంటూ పదేపదే అనిల్ అనడాన్ని అందరూ ఉదాహరణగా చూపిస్తున్నారు.