సిక్స్ పాయింట్ ప్లాన్… ఆరు స్తంభాల వ్యూహం..! బడ్జెట్లో ఇదే నిర్మలమ్మ వ్యూహం. లోక్సభలో 2026 బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఒకే దిశలో నడిపించే ఆరు బలమైన పాయంట్లను ముందుకుతెచ్చారు.
ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని కేంద్రంగా పెట్టి ఆరు అంశాలపై దృష్టి సారించడానికి ఒక స్పష్టమైన లాజిక్ ఉంది. తయారీ పరిశ్రమలు బలపడితే ఉద్యోగాలు వస్తాయి. పాత పరిశ్రమలు పునరుజ్జీవం పొందితే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు నిలబడతాయి. MSMEలు బలంగా ఉంటే పెద్ద పరిశ్రమలకు వెన్నెముకగా మారతాయి. మౌలిక వసతులు పెరిగితే పెట్టుబడులు వస్తాయి. భద్రతా స్థిరత్వం ఉంటే దీర్ఘకాల నిర్ణయాలు సాధ్యమవుతాయి.
నగర ఆర్థిక ప్రాంతాలు అభివృద్ధి చెందితే..అప్పుడు వృద్ధి కేవలం కొన్ని నగరాలకే పరిమితం కాకుండా విస్తరిస్తుంది. ఇంతకీ ఏంటా సిక్స్ పాయంట్స్?
బడ్జెట్లో చెప్పిన ఈ సిక్స్ పాయింట్ ప్లాన్ను ప్రభుత్వం వేర్వేరు స్కీముల్లా కాకుండా ఒకే చైన్కు ఉన్న లింకుల్లా డిజైన్ చేసింది.
మొదటి అంశం తయారీ రంగం. భారత్ ఇప్పటివరకు ఎక్కువగా సర్వీసెస్ ఎకానమీగా ఎదిగింది. కానీ రానున్న దశలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున రావాలంటే తయారీ రంగం తప్పనిసరి అన్నది ప్రభుత్వ లెక్క. అందుకే హెల్త్, సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్, క్యాపిటల్ గూడ్స్ లాంటి స్ట్రాటజిక్ రంగాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ను స్కేల్ అప్ చేయాలని బడ్జెట్ స్పష్టం చేసింది. దేశంలోనే ఉత్పత్తి పెరిగితే దిగుమతులు తగ్గుతాయి, ఎగుమతులు పెరుగుతాయి, ఉద్యోగాలు కూడా అదే స్థాయిలో వస్తాయన్నదే ఈ ఆలోచన వెనుక లాజిక్.
ఇక రెండో పాయింట్ పాత పరిశ్రమల పునరుజ్జీవనం. టెక్స్టైల్స్, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి రంగాలు లక్షలాది మందికి ఉపాధినిచ్చినా..అవి కొంతకాలంగా పోటీలో వెనకబడ్డాయి. ఈ రంగాలు బలహీనపడితే చిన్న పట్టణాలు, జిల్లా కేంద్రాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి. అందుకే లెగసీ ఇండస్ట్రీలను తిరిగి నిలబెట్టడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
మూడో అంశం MSMEలు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లేకుండా పెద్ద కార్పొరేట్ వ్యవస్థ నిలబడదు. సరఫరా గొలుసు దగ్గర నుంచి ఉపాధి వరకూ MSMEలే ఆధారం. ఈ రంగాన్ని ‘చాంపియన్ MSMEలు’గా మార్చాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం ఒక్కటే. పెద్ద కంపెనీలకు మాత్రమే కాదు, చిన్న వ్యాపారాలకు కూడా గ్లోబల్ మార్కెట్లో నిలబడే శక్తిని ఇవ్వడం. ఇక నాలుగో పాయింట్గా మౌలిక వసతులను ముందుకు తెచ్చింది ప్రభుత్వం. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, లాజిస్టిక్స్ లేకపోతే తయారీ రంగం పరుగెత్తలేదు. మౌలిక వసతులపై ఖర్చు పెడితే అది తక్షణమే పనులు సృష్టిస్తుంది, దీర్ఘకాలంలో పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అందుకే ఈ సిక్స్ పాయింట్ ప్లాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కేంద్రంగా పెట్టారు.
ఇటు ఐదో అంశం దీర్ఘకాల భద్రత, స్థిరత్వం. ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం లేకపోతే పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతారు. పాలసీలు ఒక్కసారిగా మారిపోతే వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవుతుంది.
అందుకే బడ్జెట్లో దీర్ఘకాల భద్రత, పాలసీ కంటిన్యుటీపై ప్రభుత్వం ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. ఇక ఆరవది నగర ఆర్థిక ప్రాంతాలు. ఇప్పటివరకు అభివృద్ధి కొద్ది మెట్రో నగరాలకే పరిమితమైంది. దీనికారణంగా వలసలు, ట్రాఫిక్, హౌసింగ్ సమస్యలు పెరిగాయి. ఇకపై కొత్త నగర ఆర్థిక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే వృద్ధి విస్తరిస్తుంది. చిన్న పట్టణాలు కూడా గ్రోత్కి కేంద్రాలుగా మారతాయన్నది ఈ ఆలోచనకు పునాదిగా నిలిచింది. మొత్తంగా చూస్తే ఈ సిక్స్ పాయింట్ ప్లాన్ ఒక స్కీమ్ జాబితా కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను మాన్యుఫ్యాక్చరింగ్ ఆధారిత వృద్ధి వైపు మళ్లించే ప్రయత్నం.
ఇది పనిచేస్తే ఉద్యోగాలు పెరుగుతాయి, ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి, ఆర్థిక వృద్ధి కొద్ది రంగాలకు పరిమితం కాకుండా విస్తరిస్తుంది. ఇప్పుడు అసలైన పరీక్ష అమలులోనే ఉంటుంది. మరి చూడాలి నిర్మలమ్మ ఆరు స్థంభాల ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
ALSO READ: ‘అడుక్కు తింటున్నాం..సిగ్గుతో తలదించుకుంటున్నాం..’ పాక్ ప్రధాని షాకింగ్ కామెంట్స్!