NTV Telugu Site icon

MLA Quota MLC Elections: ఆరుగురు గెలిచారు.. ఆయన మాత్రం ఓడారు..

Mlc Elections

Mlc Elections

MLA Quota MLC Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠరేపిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించారు.. అయితే, ఈ ఎన్నికల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ బరిలోకి దింపిన అనురాధ 23 ఓట్లు సాధించి విజయం సాధించారు.. ఏడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఏడుగురిని బరిలోకి దింపితే.. వైసీపీ అభ్యర్థి కోలా గురువులు మినహా మిగతా ఆరుగురు విజయం సాధించారు.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలుగా మర్రి రాజశేఖర్‌, బొమ్మి ఇజ్రాయిల్‌, పోతుల సునీత, చంద్రగిరి ఏసురత్నం, పెన్మత్స సూర్యనారాయణ రాజు, జయ మంగళ వెంకటరమణ విజయం సాధించారు.. టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంతో.. వైసీపీ అభ్యర్థి కోలా గురువులు ఓటమి చవిచూడాల్సి వచ్చింది..

Read Also: AP MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌.. టీడీపీ అభ్యర్థి విజయం

ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 175 ఓట్లకు గాను అన్ని ఓట్లు అంటే 175 ఓట్లు పోల్‌ అయ్యాయి.. ఓట్ల లెక్కింపులో అన్ని ఓట్లు వాలిడ్ అయినట్టు ముందే అధికారులు ప్రకటించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అప్రమత్తమైన అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. బరిలో ఉన్న ఒక్కో అభ్యర్థికి 21 మంది ఎమ్మెల్యేలను కేటాయించింది.. ఇక, మంత్రులను, నేతలను ఇంఛార్జ్‌లుగా పెట్టి.. ఫాలో అప్‌ చేసింది.. మొత్తం ఏడు స్థానాలను గెలుచుకునే విధంగా స్కెచ్‌ వేశారు వైసీపీ అధినేత.. కానీ, సరైన సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా.. టీడీపీ మాత్రం ఓ స్థానాన్ని గెలుచుకోవడంతో.. తమ పార్టీ ఎమ్మెల్యేలవైపు అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వైసీపీకి ఏర్పడింది.