Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీకి నేతలకు సజ్జల హెచ్చరికలు

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌ పై సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ ఐటీ, సోషల్ మీడియా, బూత్ కమిటీలకు సంబంధించి అధ్యక్షులు, పలు జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలని సూచించారు. పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. బూత్ కమిటీలు చేయబోయే పని చాలా కీలకమన్నారు. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానం చాలా పెరిగిందన్నారు. అదే టెక్నాలజీ మోసం చేయడానికి కూడా వినియోగపడుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, మనం చాలా అప్రమత్తంగా పని చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.

“ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు నాయుడు తర్వాతే ఎవరైనా. 2019 ఎన్నికలకు ముందు 40 నుంచి 45 లక్షల ఓట్లు తొలగించారు. ఆ సమయంలో జగన్ నాయకత్వంలో ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశాం. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్ళీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారు.. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్ఐఆర్‌లో భాగంగా 97 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలి. జోన్‌ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీమ్‌లను సిద్ధం చేసి, ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. మైక్రో లెవల్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషన్ బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చు. 2019 ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించే సామర్థ్యం మనకు ఉంది.” అని వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు.