Andhrapradesh: ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు ప్రజలకు శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం అంటూ తీపికబురును అందించింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితం కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 18న కార్యక్రమం ప్రారంభం నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 18నసీఎం వైయస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్లో ఇది చరిత్రాత్మక నిర్ణయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Kakani Govardhan Reddy: టీడీపీ హయాంలో అభివృద్ది పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారు..
ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలన్నారు. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని.. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఈ అంశాలపై విశేష కృషి చేశామన్నారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అని ముఖ్మమంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ముఖ్యమంత్రి జగన్. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉందంటే.. ఆ వ్యక్తికి రూ.25 లక్షలు వరకూ వైద్యం ఉచితంగా లభిస్తుందన్నారు. ఎవరికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ఫాలో అప్ కన్సల్టేషన్ రవాణా ఛార్జీల కింద రూ.300 చెల్లించాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అన్నదానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ ఈ వీడియోను అందుబాటులో ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Also: AP High Court: నిధుల మళ్లింపు కేసు.. టీటీడీ, తిరుపతి కార్పొరేషన్కి హైకోర్టు కీలక ఆదేశాలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్టు డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సీఎం ఆదేశించారు. 18న వైయస్సార్ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకూ వైద్యం ఉచితం కార్యక్రమం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభం కానుంది. 19న ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి కార్డుల పంపిణీ పూర్తి కానుంది.దీంతోపాటు వైయస్సార్ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చన్నదానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏఎన్ఎం, సీహెచ్ఓ, ఆశావర్కర్లు, వాలంటీర్, మహిళా పోలీసులు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ సహా, ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలో అవగాహన పెంచే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వైయస్సార్ఆరోగ్య శ్రీ యాప్ను డౌన్లోడ్ చేస్తారు. అంతేకాక పనిలోపనిగా దిశయాప్ను కూడా డౌన్లోడ్ చేస్తారు. భావసారూప్యత ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, ఉత్సాహవంతులు ఇందులో పాల్గొంటారు. వైయస్సార్ ఆరోగ్య శ్రీని ఎలా వినియోంచుకోవాలన్నదానిపైనే కాకుండా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నవారికి చేయూత నివ్వడం, అలాగే ఆరోగ్య సురక్ష కార్యక్రమం, చికిత్స పొందుతున్న వారికి సకాలంలో మందులు ఇవ్వడం లాంటి అంశాలపైనా ఈ కార్యక్రమంలో భాగంగా దృష్టిపెడతారు.
ఫేజ్–2 ఆరోగ్య సురక్ష జనవరి 1 నుంచి ప్రారంభం.
ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేయనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో వారంలో ఒక వార్డులో ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరగనుంది. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలన్నారు. డయాలసిస్ పేషెంట్లు (సీకేడీ) వాడుతున్న మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఫ్యామిలీ డ్యాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. మార్కాపురంలో కూడా పలాస తరహా వైద్య చికిత్సా సౌకర్యాలు అందుబాటులోకి రావాలన్నారు. కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతోపాటు యూరాలజీ డిపార్ట్మెంట్ కూడా తీసుకురావాలని సీఎం ఆదేశించారు.