NTV Telugu Site icon

YS Jagan: ఉచిత ఇసుక విధానంపై జగన్ సంచలన ట్వీట్

Ys Jagan

Ys Jagan

YS Jagan: పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట.. ఇసుక దోపిడీ ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు సర్కారు తీరు అలాగే ఉందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ఎక్స్‌(ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటని ప్రశ్నించారు. అందుకే ఆయననే అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అంటూ ప్రశ్నించారు. లభిస్తే ఎక్కడో చెప్పగలరా అంటూ ప్రశ్నలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదన్నారు. అసలు ఇసుక‌ కొందామంటేనే గత ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉందన్నారు. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా అంటూ అడిగారు. ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా అంటూ ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా.. భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా.. లేదా అంటూ ప్రశ్నించారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా అంటూ ప్రశ్నించారు వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయిందని అడిగారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీలనేతలు దోచేయలేదా అంటూ ఆరోపించారు. కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజంకాదా అంటూ జగన్ ప్రశ్నించారు. 2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన వ్యవహారం మళ్లీ ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నది వాస్తవం కాదా అని అన్నాపు. ఈ మోడస్‌ ఆపరండీకి సృష్టికర్త, మూలపురుషుడు మీరే కదా చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు, ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు, 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు, చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా మీ మనుషులకు అప్పగించారని ఆరోపించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారన్నారు. ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

Read Also: Suicide: మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తనను కేసులో ఇరికించిన వారి పేర్లు వీడియోలో వెల్లడి

“ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే.. మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబుగారు, ఆయన ముఠా వల్ల, ముఠాకొరకు, ముఠాచేతులమీదుగా నడుస్తోంది. పాలసీని ప్రకటించకుండా ప్రజలంతా దసరా పండుగలో ఉంటే, దొంగచాటుగా టెండర్లు పిలవడం నిజంకాదా? దేశంలో ఎక్కడా చూడని విధంగా ఉద్దేశపూర్వకంగా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది మీ స్వార్థం కోసం కాదా? ఎవ్వరినీ టెండర్లలో పాల్గొనకుండా దౌర్జన్యాలకు పాల్పడిన మాట వాస్తవం కాదా?” అంటూ జగన్ ప్రశ్నించారు.

“అదే గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేసింది. దోపిడీలకు అడ్డుకట్టవేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందించింది. అత్యంత పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరాచేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను ప్రకటించింది. వైయస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చింది. ప్రజలకు తక్కువ ధరకు ఒకవైపు ఇస్తూ మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేసింది. రేట్లపై సెబ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకుంది. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేసింది. మరి మీ హయాంలో ప్రభుత్వానికి ఒక్క రూపాయి రావడంలేదన్నది వాస్తవం కాదా? ప్రజలకూ ఉచితంగా అందడంలేదన్నది నిజం కాదా? ఇసుక ఉచితమే అయితే వైయస్సార్‌సీపీ హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి? మరి ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది చంద్రబాబుగారూ?” అంటూ జగన్ ప్రశ్నించారు.