YCP MLA Rachamallu Shiva Prasad Reddy fires on TDP Leaders
టీడీపీ నేతలపు నిప్పులు చెరిగారు కడప జిల్లా ప్రొద్దుటురు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పొదుపు సంఘాల మహిళలను మోసం చేసిన టీడీపీ మహిళా నేత వద్ద నుంచి డబ్బు ఇప్పించాలని టీడీపీ ఇంచార్జీ ప్రవీణ్ ఇంటి వద్దకు వెళితే మహిళలను వెంటపడి కొట్టారని ఆయన అన్నారు. మహిళలపై దాడి చేసిన టీడీపీ ఇంచార్జీ ప్రవీణ్ కు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి సమర్ధించి నాపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. నా రాజకీయ జీవితంలో ఏనాడూ నేను దౌర్జన్యాలకు, అక్రమాలకు పాల్పడలేదని, చేతనైతే నిరూపించండని ఆయన అన్నారు.
నాకు నేనుగా స్వచ్చందంగా నా అవినీతిపై, అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని కొరబోతున్నానని, అలాగే లోకేష్ నాయుడు, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి తమ ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలని అడుగుతారా అని ఆయన సవాల్ విసిరారు. రాజకీయాలలో లేనప్పుడు వారి ఆస్తులెంత, రాజకీయాల్లోకి వచ్చాక వారి ఆస్తులు ఎంత..సీబీఐ విచారణ చేపట్టాలని, నేను సీబీఐ అధికారులను కలవడానికి వెళ్ళే ముందు టీడీపీ నాయకులకు చెప్పే వెళతానని, దమ్ముంటే నాతో కలిసి మీపై కూడా సీబీఐ విచారణను కోరండని ఆయన వ్యాఖ్యానించారు.