కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు భయపెడుతున్నాయి.. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది.. దీనిపై స్పందించిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్… ప్రపంచమంతా కరోనా థర్డ్ వేవ్ వైపు మల్లుతోందని.. కొన్ని దేశాల్లో పరిస్థితి దారుణ స్థితికి చేరిందని డబ్ల్యూహెచ్వో చేసిన హెచ్చరికను తేలికగా తీసుకోవడం లేదన్నారు. అయితే, థర్డ్ వేవ్ ప్రారంభమైందా లేదా అనేది తెలుసుకునేందుకు రానున్న వంద రోజులు చాలా కీలకం అన్నారు. మరోవైపు.. థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోడీ చెప్పారన్న ఆయన.. మన జనాభాకు ఇంకా కరోనా ముప్పు తొలగలేదని, సహజ హెర్డ్ ఇమ్యూనిటీకి మనం ఇంకా చేరలేదన్నారు. దీని కోసం వ్యాక్సినేషన్పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని పేర్కొన్నారు వీకే పాల్.
మరోవైపు.. వారం రోజుల్లో కోవిడ్ 19 కేసులు స్పెయిన్లో 64 శాతం పెరగగా, నెదర్లాండ్స్ లో 300 శాతం నమోదు చేసిందని.. థాయ్లాండ్లో చాలాకాలంగా పరిస్థితి స్థిరంగా ఉంది.. కానీ, ఇప్పుడు అది కూడా స్పైక్ను నివేదిస్తోంది. ఆఫ్రికాలో కూడా కోవిడ్ -19 కేసులలో 50 శాతం పెరుగుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మయన్మార్, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు అపూర్వమైన స్పైక్ చూస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.