రెండు రోజుల్లో పెళ్లి. వేడుకకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితుల నడుమ హల్దీ వేడుకతో అప్పటివరకు ఆ ఇల్లు కళకళలాడిపోయింది. కానీ ఆ వేడుక అనంతరం స్నానానికి వెళ్లిన వధువు బాత్రూంలోనే శవమై కనిపించింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగిన ఈ ఘటన పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్కు చెందిన మున్నీ దేవి కూతురు గీత. ముజఫర్నగర్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు ఈనెల 7న బులంద్శహర్కు చెందిన సుమిత్తో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం హల్దీ వేడుక సందర్భంగా గీతకు పసుపు పూశారు. అనంతరం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లింది గీత.
Also Read: Is Shark Tank the next IPL: టీవీ ప్రోగ్రామ్ స్థాయి నుంచి బిజినెస్ లెవల్కి ఎదుగుతోందా?
సుమారు 45 నిమిషాలు దాటినా రాకపోవడం వల్ల.. కుటుంబసభ్యులు తలుపు కొట్టి పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల అనుమానించిన కుటుంబ సభ్యులు.. బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు. గీతను పరీక్షించిన వైద్యులు.. ఆమె మరణించినట్లుగా ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
Also Read: Love Marriage: ఎల్లలు దాటిన ప్రేమ.. మయన్మార్ అమ్మాయితో లవ్.. ఆదిలాబాద్లో మ్యారేజ్..