West Bengal: బెంగాల్ కురుక్షేత్రంలో గెలుపెవరిది? 2016లో 3 స్థానాలు, 2021 నాటికి 77 సీట్లు.. బీజేపీ మాస్టార్ ప్లాన్ పనిచేస్తుందా?

West Bengal Election Results

West Bengal Election Results

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. 2011 నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించి, 35 ఏళ్ల సుదీర్ఘ వామపక్ష పాలనను అంతమొందించిన మమతా బెనర్జీ, ఈసారి తన పట్టు నిలుపుకుంటారా? లేక బెంగాల్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఓటర్ల జాబితా నుంచి భారీగా పేర్లు తొలగించడం, చొరబాట్లు, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాల చుట్టూ తిరిగిన ఈ ఎన్నికల పోరులో అంతిమ విజేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

2016లో కేవలం 3 స్థానాలు, 10 శాతం ఓట్ల వాటాతో మొదలైన బీజేపీ ప్రస్థానం, 2021 నాటికి 77 స్థానాలు, 38 శాతం ఓట్ల వాటాతో ఊహించని రీతిలో పుంజుకుంది. అయితే, అదే సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా తన బలాన్ని పెంచుకుంటూ 215 స్థానాలతో 48 శాతం ఓట్ల వాటాను దక్కించుకుంది. ఈసారి బీజేపీ వ్యూహకర్త అమిత్ షా మొదటి దశలోనే 110 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేయగా, 152 స్థానాలు ఉన్న దక్షిణ బెంగాల్ మాత్రం ఇప్పటికీ తృణమూల్ కంచుకోటగానే కనిపిస్తోంది. కానీ ఉత్తర బెంగాల్‌పై బీజేపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 148 కాగా, రీపోలింగ్ కారణంగా ఫాల్టా మినహా మిగిలిన 293 స్థానాల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి.

మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన గెలుపుపై అమితమైన నమ్మకంతో ఉన్నారు. 92 శాతానికి పైగా పోలింగ్ నమోదవ్వడం తమకు అనుకూలమని భావిస్తున్న ఆమె, ఈసారి 226 నుంచి 230 స్థానాలు గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంపై స్పందిస్తూ, అది ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేందుకు పన్నిన కుట్ర అని ఆమె కొట్టిపారేశారు. అయితే, సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను (సుమారు 11.6 శాతం ఓటర్లు) జాబితా నుంచి తొలగించడం తృణమూల్ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అంశంగా మారింది. ఇందులో 27 లక్షల మందికి పైగా ఓటర్ల అప్పీళ్లు ఇంకా పెండింగ్‌లో ఉండటం గమనార్హం.

ఈ ఎన్నికలను మమతా బెనర్జీ ఒక ‘జీవన్మరణ పోరాటం’గా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో చక్రాల కుర్చీలో కూర్చుని పెయింటింగ్ వేస్తున్న మమత చిత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లగా, ఈసారి బీజేపీ తన వ్యూహాలను మార్చింది. కేవలం అవినీతి, శాంతిభద్రతల సమస్యలను మాత్రమే కాకుండా, తృణమూల్ పాలనను “లెఫ్ట్ ఫ్రంట్ 2.0” గా అభివర్ణించింది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, స్థానికతను చాటుతూ ‘మట్టి బిడ్డలకు’ అవకాశం ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో కూడా కేవలం “జై శ్రీరామ్” మాత్రమే కాకుండా, బెంగాలీ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ “జై మా కాళి”, “జై మా దుర్గ” నినాదాలను ఎత్తుకుంది. చివరకు తమ బెంగాలీ మూలాలను నిరూపించుకోవడానికి బీజేపీ అభ్యర్థులు చేపలతో ప్రచారం చేయడం కూడా ఆసక్తిని రేకెత్తించింది.

దీనికి ప్రతిగా మమతా బెనర్జీ “బయటి వ్యక్తుల నుంచి బెంగాల్ సంస్కృతిని కాపాడుకోవడం” అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ తర్వాత, ఆమె తన పాత నినాదాన్ని “మార్పు వద్దు – ప్రతీకారం కావాలి” (Badal noy Badla chai) అని మార్చి ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఓట్లు తొలగించబడిన కుటుంబాల ఆగ్రహాన్ని తన ఓట్లుగా మలుచుకోవాలని ఆమె చూస్తున్నారు. ముఖ్యంగా భవానీపూర్ స్థానంలో తన మాజీ అనుచరుడు సువేందు అధికారితో తలపడుతున్న మమతకు, 2021 నందిగ్రామ్ ఫలితం పునరావృతం కాకూడదన్నది ప్రధాన లక్ష్యం. 71 ఏళ్ల వయస్సులో ఉన్న దీదీకి, ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే తిరిగి పుంజుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. బెంగాల్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందా లేక పాత పాలకులకే పట్టం కడుతారా అనేది మరికొద్ది సేపట్లో తేలిపోతుంది.