విశాఖలో గంజాయి ముఠాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసారు. ఈ దాడిలో గంజాయి స్మగ్లర్లుగా అవతారం ఎత్తిన కానిస్టేబుల్ల బండారం బయటపడింది. గంజాయి స్మగ్లింగ్ కేసులలో విశాఖ, విజయనగరం జిల్లా కానిస్టేబుల్లు పట్టుబడ్డారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని భీమిలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని భీమిలి పోలీసులు చెప్పారు.
కారులో తరలిస్తున్న సుమారు 10 కేజీల గంజాయి పట్టుబడింది. కారును పోలీసులు సీజ్ చేసారు. నిందితుల్లో ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఉండగా.. ప్రధాన నిందితుడిగా ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్ ఉన్నాడు. మిగతా ఇద్దరు సివిలియన్స్. ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్పై గతంలో పదికి పైగా దారి దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నట్లు సమాచారం. నేరాలు చేయడంతో విధుల నుంచి గతంలోనే శివప్రసాద్ను అధికారులు తొలగించారు.
గంజాయి కేసులో పట్టుబడిన వారిలో ఏపీఎస్పీ మాజీ కానిస్టేబుల్ శివప్రసాద్, వీ రాంబాబు సివిల్ కానిస్టేబుల్ (ఎస్ కోట ), సతీష్ సివిల్ కానిస్టేబుల్ (కొత్త వలస ), పి శివ కృష్ణ (శ్రీకాకుళం ), గోపి (ఎస్ కోట )లు ఉన్నారు. వీరు ఎక్కడి నుంచి గంజాయి తీసుకొస్తున్నారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారనే గంజాయి మూలాలుపై విచారణ జరుగుతుంది.
