టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం పొట్టి క్రికెట్కు టాటా చెప్పిన కోహ్లీ.. తాజాగా టెస్టులకు గుడ్బై చెప్పాడు. ఇక కింగ్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2011లో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్.. 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ టెస్ట్ కెప్టెన్ కూడా. ఆ రికార్డ్స్ ఏంటో ఓసారి చూద్దాం.
2015లో ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. జనవరి 2022 వరకు టెస్ట్ కెప్టెన్గా ఉన్న కోహ్లీ.. 68 మ్యాచ్లలో సారథిగా వ్యవహరించాడు. విరాట్ సారథ్యంలో టీమిండియా 40 మ్యాచ్ల్లో గెలవగా.. 17 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. ఇక 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ విజయశాతం 58.82 శాతంగా ఉంది. ఇది మరెవరికి సాధ్యం కాలేదు. భారత క్రికెట్కు 2015-2022 మధ్య కాలం స్వర్ణ యుగంగా నిలిచింది. దాంతో టీమిండియా టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు.
Also Read: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
ఎంఎస్ ధోనీ 60 టెస్టుల్లో భారత్కు నాయకత్వం వహించాడు. ఇందులో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలు ఉన్నాయి. ధోనీ విజయ శాతం 45గా ఉంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడింది. ఇందులో 21 విజయాలు, 13 ఓటములు ఉండగా.. 15 డ్రాగా ముగిసాయి. దాదా విజయ శాతం 42.86గా ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ 47 టెస్టుల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు.14 విజయాలు, 14 ఓటములు మరియు 19 డ్రాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అజారుద్దీన్ విజయ శాతం 29.78.