Virat Kohli – Rohit Sharma: ప్రస్తుత టీమిండియా జట్టులో ఉన్న దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్కే పరిమితమయ్యారు. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్పై ఇద్దరూ దృష్టి సారించినప్పటికీ.. జట్టులో వారి స్థానం పూర్తిగా ఖరారైందని చెప్పడానికి లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో జరగనున్న న్యూజిలాండ్ పర్యటన వీరిద్దరి కెరీర్లోనే అత్యంత కీలకంగా మారనుంది.
భారత జట్టు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సుదీర్ఘ పర్యటనలో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది. న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు ఆడనున్న అతిపెద్ద పర్యటనగా ఇది నిలవనుంది. ముఖ్యంగా వన్డే సిరీస్ కోహ్లీ, రోహిత్ల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది. వీరిద్దరూ తమ అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్నారు. దీంతో ఈ పర్యటన వారిద్దరికీ చివరి న్యూజిలాండ్ టూర్ కావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ పర్యటన కేవలం భావోద్వేగాలకు మాత్రమే పరిమితం కాదు. వన్డే సిరీస్లో కోహ్లీ, రోహిత్ అద్భుత ప్రదర్శన చేస్తే వచ్చే వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మరింత బలపడతాయి. మరోవైపు ఆశించిన స్థాయిలో మాత్రం రాణించలేకపోతే వారి వరల్డ్కప్ కలకు గట్టి దెబ్బ పడవచ్చు. ఇప్పటికే టీమ్ మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఈసారి న్యూజిల్యాండ్ పర్యటనకు మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత్-న్యూజిలాండ్ మధ్య 100 ఏళ్ల క్రికెట్ సంబంధాలను పురస్కరించుకుని ఈ సిరీస్ను నిర్వహించనున్నారు. దాదాపు 40 రోజుల పాటు కొనసాగే ఈ పర్యటన అక్టోబర్ 22న క్రైస్ట్చర్చ్లో జరిగే తొలి టీ20తో ప్రారంభమవుతుంది. టీ20 సిరీస్ అనంతరం ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే నవంబర్ 4న ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. అనంతరం నవంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటన కేవలం ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాకుండా.. కోహ్లీ-రోహిత్ల అంతర్జాతీయ భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపుగా మారనుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
