Fire Accident: ఆటోనగర్‌లోని హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..

Swpnalok Fire Accident

Swpnalok Fire Accident

విజయవాడలోని ఆటోనగర్‌లో ఉన్న ప్రముఖ హ్యుందాయ్ కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం పైభాగంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎగసిపడుతున్న పొగ, మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఆదివారం సెలవు దినం కావడంతో షోరూమ్‌లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఆకస్మికంగా పిడుగు పడటం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆస్తి నష్టం అంచనాతో పాటు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.

దంపతుల ఆత్మహత్య.. 
మరోవైపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్తకాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్రి దుర్గాలక్ష్మి (43), ఆమె భర్త వెంకట నాగేశ్వరరెడ్డి (53) తమ ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భారీగా ఉన్న అప్పులు, ఆర్థిక లావాదేవీల చిక్కుల వల్లే వీరు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల ఇదే కొత్తకాలనీలో కొప్పిశెట్టి నాగమల్లేశ్వరి అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో దుర్గ తనకు 15 లక్షల రూపాయలు ఇవ్వాలని పేర్కొంది. అంతేకాకుండా దుర్గకు మరొక మహిళ నుంచి సుమారు కోటి రూపాయల వరకు రావాల్సి ఉన్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ వరుస ఆత్మహత్యల వెనుక ఉన్న భారీ ఆర్థిక లావాదేవీలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.