విజయవాడలో ఒక సామాన్య సెలూన్ నిర్వాహకుడికి ఎదురైన వింత అనుభవం.. ప్రస్తుతం ఆధార్, పాన్ కార్డుల భద్రతపై పెను ఆందోళనను రేకెత్తిస్తోంది. కేవలం కత్తెర, దువ్వెనతో జీవనం సాగించే వ్యక్తికి కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారంతో ముడిపెట్టి నోటీసులు పంపడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
అమాయకుడిపై అక్షరాలా రూ.72 లక్షల భారం
విజయవాడ పంజా సెంటర్ సమీపంలో గత నాలుగు దశాబ్దాలుగా సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తన జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో సుమారు రూ.72 లక్షల జీఎస్టీ (GST) బకాయి చెల్లించాలని జిఎస్టీ అధికారుల నుంచి ఆయనకు నోటీసులు అందాయి. విశాఖపట్నం కేంద్రంగా భారీ ఎత్తున ‘స్క్రాప్ ఐరన్’ (పాత ఇనుము) వ్యాపారం నిర్వహించినట్లు, దానికి సంబంధించిన పన్నులు చెల్లించలేదని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
బ్యాంక్ ఖాతా నిలిపివేత..
తనకు తెలియకుండానే తన పేరు మీద ఇంత పెద్ద మోసం జరుగుతోందని శ్రీనివాసరావుకు మొదట తెలియలేదు. అయితే.. ఇటీవల ఆయన తన బ్యాంక్ ఖాతా నుంచి నగదు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఖాతా ‘హోల్డ్’లో ఉన్నట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. జిఎస్టీ అధికారుల ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న ఆయన, తన ఆవేదనను అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. “చిన్నప్పటి నుంచి సెలూన్ షాపులో కష్టపడి బతుకుతున్నాను.. నాకు ఇనుప వ్యాపారంతో సంబంధం లేదు” అని చెప్పినా అధికారులు మాత్రం విశాఖ వెళ్లి వివరణ ఇవ్వాలని సూచించారు.
Also Read:HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!
డాక్యుమెంట్లతో కేటుగాళ్ల మాయాజాలం..
ఈ ఉదంతం వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు స్థానికులు, బాధితుడు అనుమానిస్తున్నారు. శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆయన ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను సేకరించిన గుర్తుతెలియని వ్యక్తులు, వాటితో నకిలీ కంపెనీని సృష్టించి ఉంటారని భావిస్తున్నారు. ఇలాంటి నకిలీ లావాదేవీల వల్ల ఆయన ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా.. ఈ వివాదం కారణంగా ఆయనకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రస్తుతానికి నిలిచిపోయాయి.
ప్రస్తుతం శ్రీనివాసరావు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ యుగంలో వ్యక్తిగత పత్రాలు ఎంత సులభంగా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. అధికారులు లోతైన విచారణ జరిపి.. అసలు నిందితులను పట్టుకోవాలని, అమాయకుడైన శ్రీనివాసరావుకు ఈ పన్నుల భారం నుంచి విముక్తి కలిగించాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.