శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదో రోజున శ్రీ మహిషాసురమర్దనీదేవి అవతారంలో విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి నవ అవతారాల్లో మహిషాసురమర్దనిని మహోగ్రరూపంగా భక్తులు భావిస్తారు. అమ్మ మహిషాసురుడిని సంహరించిన ఆశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్ణవమి’గా ఈ రోజును జరుపుకొంటారు. ‘చండీ సప్తశతి’ ప్రకారం దుర్గాదేవి అష్టభుజాలతో, సింహవాహినిగా మహిషాసురుడి సేనాపతులతో పాటు రాక్షసులందరినీ సంహరించింది. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో అవలీలగా మహిషాసురుణ్ణి చంపి, అదే స్వరూపంతో ఇంద్రకీలాద్రి మీద స్వయంభువుగా దుర్గమ్మ తల్లి వెలసింది.
Read Also: Astrology: అక్టోబర్ 23, సోమవారం దినఫలాలు
ఇక, బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం కూడా ఇదే.. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా కనకదుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అయితే, అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిషాసుర మర్ధిని అవతారంలో, 2 గంటల నుంచీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలోనూ దర్శనం ఇస్తారు. ఒకేరోజు రెండు తిథులు రావడంతో ఈ విధంగా రెండు అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంద్రకీలాద్రికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు.
Read Also: Traffic Restrictions: నేటి నుంచి 26 వరకు హుస్సేన్సాగర్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక, అమ్మవారికి నైవేద్యం: బెల్లపు అన్నం, గారెలు, పాయసం, పులిహోర, అప్పాలు
అమ్మవారికి అలంకరించే చీర రంగు: గోధుమ, ఎరుపు
అమ్మవారికి అర్పించే పూల రంగు: తామర పుష్పాలు
ఇవాళ్టి పారాయణం: మహిషాసురమర్దనీ స్తోత్రం