టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల (ఫిబ్రవరి) 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయ్పూర్లోని ఒక చారిత్రక ప్యాలెస్లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read : Tvk Vijay : విజయ్ కు షాక్.. ఎన్నికల తర్వాతే విజయ్ ‘జననాయగన్’..
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహానికి రావాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రికి స్వయంగా పెళ్లి పత్రికను అందజేశారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ కొద్దిసేపు ముచ్చటించారు. తన జీవితంలో కీలకమైన ఈ వేడుకకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, కాబోయే దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో వెండితెరపై మెరిసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఉదయ్పూర్ వివాహం అనంతరం హైదరాబాద్లో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.