Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

Vaibhav Sooryavanshi Match

Vaibhav Sooryavanshi Match

Vaibhav Sooryavanshi: నిన్న (మంగళవారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 93) మరోసారి రెచ్చిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ బుడ్డోడి ధాటికి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1 ఓవర్లలో ఛేదించింది. దీంతో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక, క్రికెట్ పిచ్‌పై బ్యాట్‌తో విన్యాసాలు చేస్తూ, వరుసగా మూడోసారి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ అనంతరం మనసులోని మాటలను పంచుకున్నాడు. జట్టుకు ఎంతో కీలకమైన సమయంలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న వైభవ్, మ్యాచ్ అనంతరం తన వ్యూహాలను చాలా సరళంగా వివరించాడు.

జట్టు బౌలింగ్ చేస్తున్న సమయంలో బయట కూర్చుని వికెట్‌ను నిశితంగా గమనించానని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు తనకు అనిపించిందని వైభవ్ తెలిపాడు. అందుకే క్రీజులోకి వెళ్ళిన వెంటనే ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. మొదట్లో కాస్త సమయం తీసుకుని, వికెట్ పడకుండా క్రీజులో ఎక్కువసేపు నిలబడితే… అవతలి ఎండ్‌లో ఉండే తోటి బ్యాటర్‌కు కూడా ఒత్తిడి తగ్గి బాగా ఆడటానికి సహాయపడుతుందని భావించినట్లు పేర్కొన్నాడు. తాను మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినప్పటికీ, అంతలోనే వేగంగా హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని స్పష్టం చేశాడు. తనకు ఎప్పుడైనా సరే వరుసగా రెండు మూడు ఫోర్లు లేదా సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఉందనే నమ్మకం ఉందని, అందుకే అనవసరంగా కంగారు పడకుండా ఆటను చివరి వరకు తీసుకెళ్లాలనే మైండ్‌సెట్‌తోనే బ్యాటింగ్ చేసినట్లు వివరించాడు.

ఇంత చిన్న వయసులోనే తనపై వస్తున్న ప్రశంసలు, మీడియాలో వస్తున్న వార్తల గురించి మాట్లాడుతూ… తాను వీటన్నింటికీ చాలా దూరంగా ఉంటానని వైభవ్ అన్నాడు. తాను పెద్దగా వార్తాపత్రికలు చదవనని, అందుకే ఈ ప్రశంసలను తలకెక్కించుకోనని చెప్పాడు. ఇది కేవలం తన కెరీర్ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ఆడితే ప్రజలు ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారని పేర్కొన్నాడు. కాబట్టి తన దృష్టి అంతా కేవలం ఆటపైనే ఉండాలని, తన లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశాడు. ఇక మ్యాచ్‌ల్లో తను చేసే రకరకాల సెలబ్రేషన్స్ (సంబరాలు) గురించి అడగ్గా… దాని వెనుక పెద్దగా ప్లానింగ్ ఏమీ ఉండదని నవ్వుతూ చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక కొత్త రకమైన సెలబ్రేషన్ చేయడం తనకు అలవాటని, దానికి ప్రత్యేకమైన అర్థం అంటూ ఏమీ ఉండదని తెలిపాడు. గత మ్యాచ్‌లో చేసిన సెలబ్రేషన్‌కు సైతం ఎలాంటి అర్థం లేదని, కేవలం కొత్తగా ప్రయత్నించాలనే అలా చేశానని అన్నాడు.

ఫైనల్ మ్యాచ్ గురించి, జట్టు ఆలోచనా విధానం (మైండ్‌సెట్) గురించి మాట్లాడుతూ… తామంతా ఆటను పూర్తిగా ఆస్వాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పాడు. రాబోయే ఫైనల్ మ్యాచ్‌లో మైదానం వెలుపల జరిగే విషయాల గురించి ఆలోచించి అనవసరమైన ఒత్తిడి తెచ్చుకోబోమని స్పష్టం చేశాడు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఎలాగైతే ఆటను ఆస్వాదిస్తూ ఆడామో, మున్ముందు కూడా ప్రతి ఒక్కరూ గేమ్ మీదే దృష్టి పెట్టి ప్రశాంతంగా ఆడతామని తెలిపాడు. ఈ టోర్నీలో తమకు కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ… చక్కటి క్రికెట్ ఆడి మ్యాచ్‌లను గెలవడమే తమ ఏకైక లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ ఎంతో పరిణతితో చెప్పుకొచ్చాడు.