Ustaad Bhagath Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రభుత్వం తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు అనుమతి ఇచ్చింది. సినిమా విడుదల రోజైన మార్చి 19న రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఒక ప్రత్యేక బెనిఫిట్ షో ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ షో తెల్లవారుజామున 4:00 AM నుండి 5:00 AM మధ్య ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక షోకి టికెట్ ధరను గరిష్టంగా రూ. 500 (జీఎస్టీతో కలిపి) గా నిర్ణయించారు.
సాధారణ ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉంటూనే, సినిమా బడ్జెట్ దృష్ట్యా టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. విడుదలైన మొదటి 10 రోజుల పాటు (మార్చి 19 నుండి మార్చి 28 వరకు) ఈ పెరిగిన ధరలు అమలులో ఉంటాయి. ప్రతి టికెట్పై రూ. 100 అదనంగా పెంచుకోవచ్చు. అలానే విడుదల రోజున అంటే మార్చి 19న, బెనిఫిట్ షోతో పాటు అదనంగా మరో 5 షోలు (మొత్తం 6 షోలు) ప్రదర్శించుకునేలా మినహాయింపు ఇచ్చారు. మిగిలిన రోజుల్లో రోజుకు 5 షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు మరియు పోలీస్ కమిషనర్లకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ నిర్ణయం పంపిణీదారులకు పెద్ద ఊరటనిచ్చినట్లయింది.
READ ALSO: Anasuya: వ్యూస్ కోసం అనసూయపై వికృత చేష్టలు.. వ్యక్తి అరెస్ట్
