అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం 4:35 గంటలకు ట్రంప్ మొదట ఒక ప్రకటన చేశారు. అయితే.. కొద్దిసేపటికే ఆ పోస్ట్ను తీసివేసి, కొన్ని చిన్న మార్పులు చేసి సాయంత్రం 4:53 గంటలకు మళ్లీ పోస్ట్ చేశారు. ఈ రెండు ప్రకటనల సారాంశం ఒక్కటే అయినప్పటికీ, కొన్ని పదాలను సవరించడం గమనార్హం.
గత మూడు వారాలుగా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చాలా చర్చలు జరిగాయని ట్రంప్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి, గొడవలను శాశ్వతంగా ముగించడానికి ఈ చర్చలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
Also Read:War Break: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్పై దాడులకు బ్రేక్..
చర్చలు జరుగుతున్న తీరును బట్టి, ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, చమురు నిల్వ కేంద్రాలపై ఎటువంటి దాడులు చేయవద్దని ట్రంప్ తన రక్షణ శాఖను ఆదేశించారు. ఈ దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమైతేనే ఈ విరామం కొనసాగుతుందని, లేదంటే మళ్ళీ దాడులు తప్పవని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
ట్రంప్ ప్రకటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. తాము ఇచ్చిన గట్టి హెచ్చరికల వల్లే ట్రంప్ దాడులను ఆపివేశారని ఆఫ్ఘనిస్తాన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం వ్యాఖ్యానించింది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. అలాగే.. ఇరాన్కు చెందిన ‘తస్నిమ్’ వార్తా సంస్థ ‘ట్రంప్ వెనక్కి తగ్గారు’ అంటూ ఈ పరిణామాన్ని అభివర్ణించింది.