భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వినియోగదారులకు ఒక గొప్ప శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లేదా చిరునామా మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగడం.. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం తప్పనిసరి ఉండేది. కానీ.. ఇప్పుడు ‘mAadhaar’ యాప్ ద్వారా ఈ పనులన్నీ ఇంటి నుంచే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త డిజిటల్ విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.
మొబైల్ నంబర్ మార్చుకోవడం ఎలా?
మీ స్మార్ట్ఫోన్లో ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, అందులో ‘అప్డేట్ మొబైల్ నంబర్’ ఆప్షన్ను ఎంచుకోవాలి. కొత్త నంబర్ను నమోదు చేసి, దానికి వచ్చే ఓటీపీ (OTP) ద్వారా ధృవీకరించుకోవాలి. ఆ తర్వాత ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసి అభ్యర్థనను పంపాలి. అనంతరం యూఐడీఏఐ అధికారులు మీ వివరాలను పరిశీలించి అప్డేట్ను ఖరారు చేస్తారు. యాప్ ద్వారానే మీ రిక్వెస్ట్ స్టేటస్ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.
చిరునామా మార్పు ప్రక్రియ..
అడ్రస్ మార్చుకోవాలనుకునే వారు యాప్లో లాగిన్ అయి ‘సర్వీసెస్’ విభాగంలోని ‘అడ్రస్ అప్డేట్’ ఫీచర్ను ఎంచుకోవాలి. మీ కొత్త చిరునామా వివరాలను నమోదు చేసి, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. దీనికోసం నిర్ణీత రుసుము రూ. 75 చెల్లించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఆన్లైన్ సదుపాయం వల్ల పేపర్వర్క్ తగ్గుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉంటూ ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ స్థిరంగా ఉండేలా చూసుకుని.. సరైన పత్రాలతో ఈ ప్రక్రియను నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. భారతదేశం డిజిటల్ సేవల దిశగా వేస్తున్న అడుగుల్లో ఇది ఒక కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.