NTV Telugu Site icon

Ram Mohan Naidu: ఏపీలో నూతన విమానాశ్రయాలు.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి

Rammohan Naidu

Rammohan Naidu

Ram Mohan Naidu: రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. సీ ప్లేన్ కార్యకలాపాలు రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మొట్టమొదటి సీ ప్లేన్ డెమోను అక్టోబర్‌లో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు నిర్వహిస్తామన్నారు. గతంలోనూ సీ ప్లేన్ కార్యకలాపాలపై ప్రయత్నాలు జరిగినా నిబంధనలు, ఇబ్బంది కారణంగా కార్యరూపం దాల్చలేదన్నారు. సీ ప్లేన్ కేవలం పర్యాటకం కోసమే కాకుండా వైద్య, పౌర రవాణాకు ఉపయోగపడేలా నిబంధనలు సడలిస్తున్నామని తెలిపారు.

Read Also: Srisailam: శ్రీశైలంలో ఈనెల 29న స్వర్ణరథోత్సవం

విమానాశ్రయానికి వేల ఎకరాల్లో భూమి అవసర సమస్యకు పరిష్కారంగా సీ ప్లేన్ విధానం ప్రోత్సహించాలన్నది మోదీ ప్రభుత్వ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. ఉన్న విమానాశ్రయాల సామర్ధ్యం పెంచుతున్నామన్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోందన్నారు. నివేదిక అందిన తర్వాతే దానిపై మాట్లాడతామన్నారు. ఎయిర్ క్రాష్ ప్రమాదాలకు సంబంధించి విమానయాన శాఖలో విచారణ నిమిత్తం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఉందని మంత్రి తెలిపారు.

Read Also: AP Cabinet: రేపు ఏపీ ఈ-కేబినెట్ భేటీ.. అంతా ఆన్‌లైన్‌లోనే!

రాష్ట్ర ఎన్నికల్లో ప్రజా తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని.. 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని దీనిబట్టే అర్ధమవుతోందని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది, న్యాయస్థానం పరిధిలో ఉన్న ఈ అంశంపై తాను మాట్లాడనన్నారు. సామాన్యుడికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యం కల్పించేందుకే సెప్టెంబర్1 నుంచి రెవెన్యూ సదస్సులు పెడుతున్నామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు సీఎం అవ్వటంతో ఢిల్లీతో పాటు జాతీయ స్థాయిలో ఏపీ ఇమేజ్ పెరుగుతోందన్నారు. నాయకులకు-ప్రజలకు అనుసంధానం కొనసాగేలా ప్రవేశపెట్టిన ప్రజా దర్బార్ సత్ఫలితాలనిస్తోందన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండేందుకే ప్రజా సమస్యలు స్వయంగా స్వీకరించి, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో నేరుగా మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్చడం తో పాటు సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.