Retired out: బ్యాంకాక్ లోని టెర్డ్థాయ్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఆసియా క్వాలిఫయర్స్ 2025 మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మహిళల జట్టు ఎవరూ ఊహించలేని వ్యూహాన్ని అమలు చేసింది. ఖతర్పై భారీగా ఆధిపత్యం చూపిన యూఏఈ జట్టు ఇన్నింగ్స్ చివరిలో జట్టు మొత్తం ఆటగాళ్లను రిటైర్డ్ అవుట్ చేసి ఆటను త్వరగా ముగించింది. ఇలా చేసిన కానీ చివరికి 163 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ పట్టికలో ముందంజ వేసింది. ఇక అసలు ఇలా చేసిందన్న విషయానికి వస్తే..
Read Also: Realme GT 7T: భారత్ లో లాంచ్కు సిద్ధమైన రియల్మీ GT 7T.. ఫస్ట్ లుక్ విడుదల.!
యూఏఈ తరఫున ఓపెనర్లు తీర్థ సతీష్, కెప్టెన్ ఎషా రోహిత్ ఓజా అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిపి 16 ఓవర్లలోనే 192 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఎషా ఓజా 55 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 113 పరుగులు సాధించగా, తీర్థ సతీష్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించింది. అయితే ఈ సమయంలో మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, టీ20 ఫార్మాట్లో డిక్లరేషన్ అనుమతించనందున, యూఏఈ జట్టు వినూత్న వ్యూహాన్ని అనుసరించింది. ప్రతి బ్యాటర్ క్రీజ్కు వచ్చి వెంటనే రిటైర్డ్ అవుట్ కావడం ద్వారా ఇన్నింగ్స్ను వేగంగా ముగించారు. ఇది టీ20 అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చట్టబద్ధమే అని చెప్పవచ్చు.
అయితే, ఈ వ్యూహం మ్యాచ్ ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపలేదు. యూఏఈ బౌలర్లు ఖతర్ జట్టును 11.1 ఓవర్లలో కేవలం 29 పరుగులకే ఆలౌట్ చేశారు. ఖతర్ జట్టు ఇన్నింగ్స్ లో ఏకంగా ఏడు మంది బ్యాటర్లు ఖాతా తెరవలేకపోయారు. ఇక యూఏఈ జట్టులో ఎడమచేతి స్పిన్నర్ మిచెల్ బోథా 3 వికెట్లు తీసింది. అలాగే కేటీ థాంప్సన్ 2 వికెట్లు తీయగా.. ఎషా, హీనా హోచ్చందాని, ఇంధూజ నందకుమార్, వైష్ణవే మహేష్ తలో వికెట్ పడగొట్టారు. ఇక ఆల్రౌండ్ ప్రదర్శనతో కెప్టెన్ ఎషా రోహిత్ ఓజాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఆమె బ్యాటింగ్లో సెంచరీతో పాటు, బౌలింగ్లో ఒక ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చి ఒక వికెట్ తీసింది.
ఈ విజయంతో యూఏఈ 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. మొదటి మ్యాచ్లో మలేషియాపై 9 వికెట్ల తేడాతో గెలిచిన యూఏఈ, మే 13న మలేషియాను మళ్లీ ఎదుర్కోనుంది. ఈ క్వాలిఫయర్ పోటీల్లో 9 జట్లు పాల్గొంటుండగా వాటిని మూడు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులోని అగ్ర 3 జట్లు సూపర్ త్రీ స్టేజ్కు అర్హత పొందుతాయి. అలా ఫైనల్ విజేత తదుపరి దశకు ప్రవేశిస్తుంది.