Live-In Relationships: సహజీవనం.. నలుగురి ప్రాణాలు తీసింది. రెండు వేర్వేలు ఘటనల్లో రెండు జంటలు తమ ప్రాణాలు తీసుకున్నారు. వారి బలవన్మరణాలకు అసలు కారణం ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన విషయాలలోకి వెళితే.. ఆమెకు 29.. అతనికి 21.. అమ్మాయిది ఉత్తరప్రదేశ్.. అబ్బాయిది రాజస్థాన్.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం అసియా, పవన్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేట్లో కాపురం పెట్టారు. కానీ ఇంతలోనే ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు.
అమ్మాయి ముస్లిం. పేరు ఆసియాఖాన్. యువకుడేమో హిందువు.. పేరు పవన్.. తన ప్రేయసి ముస్లిం కావడంతో తన పేరును అహ్మద్ఖాన్గా మార్చుకున్నాడు పవన్. జీవితం చిన్నది.. సంతోషంగా ఉందాం అంటూ కలిసి రీల్స్ కూడా చేసుకున్నారు. కానీ, పెళ్లి అయిన నాలుగు నెలలకే ఇద్దరూ కలిసి జీవితాన్ని ముగించారు. పవన్ డ్యూటీకి వెళ్లొచ్చేసరికి ఫ్యాన్కి ఉరేసుకుని కనిపించింది ఆసియా. ప్రేయసి మరణాన్ని తట్టుకోలేని పవన్ కూడా అదే ఫ్యాన్కి ఉరేసుకుని మరణించాడు. ఆసియాకి గతంలోనే వివాహం కాగా ఓ బాలుడు ఉన్నాడు. భర్తతో విడిపోయి.. పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుటుంబాలను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో వీళ్లిద్దరినీ దూరం పెట్టాయి ఇరు కుటుంబాలు. దాంతో, బంధువులు ఎవరూ చూడ్డానికి కూడా రాలేదు. ఆసియా, పవన్ ఆత్మహత్యపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. దీంతో ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అంబర్పేటలో వారు ఉంటున్న ఇంటి యజమాని పవన్కు ఫోన్ చేసి రెంట్ కట్టాలని కోరాడు. డబ్బు చెల్లించి ఇంటిని ఖాళీ చేసి వెళ్తామని బదులిచ్చాడు పవన్. లక్ష్మీనగర్లోని నివాసానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే మనస్పర్థానికి గురైన ఆసియా ఇంట్లోని ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిని గుర్తించిన పవన్ … ఆమె డెడ్ బాడీని కిందికి దించాడు. అనంతరం తాను కూడా అదే ఫ్యాన్ కు చున్నీతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియాల్సి ఉంది.
మరోవైపు వరంగల్లో వివాహేతర బంధం ఒక యువతి, ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. కూతురు వయసున్న యువతిని లోబరుచుకుని పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. చివరకు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మహిళ పేరు గాయత్రి. వరంగల్ ఎనుమాముల ఇందిరమ్మ కాలనీకి చెందిన గాయత్రి ఇంటర్ మధ్యలోనే ఆపేసింది. ఇంటి ఎదురుగా ఉండే 42 ఏళ్ల డీసీఎం డ్రైవర్ వేల్పుగొండ స్వామికి అప్పటికే పెళ్లై, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయినా గాయత్రిని మాయమాటలు చెప్పి లోబరుచుకుని ప్రేమాయణం సాగించాడు.ఈ విషయం తెలుసుకున్న గాయత్రి తల్లిదండ్రులు ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. పెద్దలు మందలించడంతో స్వామి తన మకాంను హన్మకొండకు మార్చాడు. అయితే, గాయత్రితో రహస్యంగా సంబంధాన్ని కొనసాగించాడు.
Keeway RR 300: స్పోర్ట్స్ బైక్ లవర్స్కు గుడ్ న్యూస్.. స్టైల్, స్పీడ్ కలయికతో కీవే RR 300 లాంచ్..!
గాయత్రికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు భావిస్తుండగా, ఈ నెల 2వ తేదీన ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. 10 తులాల బంగారం, నగదు తీసుకుని స్వామితో కలిసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన గాయత్రి, స్వామితో కలిసి విజయవాడ, గుంటూరులలో గడిపింది. ఆ తర్వాత వేములవాడలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం అన్నారానికి వచ్చిన ఇద్దరూ ఒక అద్దె గది తీసుకున్నారు. ఈ బంధం నిలబడదని భావించిన స్వామి, గాయత్రిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు సమాచారం. దీంతో ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఘటనా స్థలంలోనే స్వామి మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న గాయత్రిని రూమ్ యజమాని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.