రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరికొన్ని రోజుల్లో మేనమామ పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఇద్దరు చిన్నారులను విధి వెంటాడింది. ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామేన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయి శ్రీ(5), షాబాద్ మండలం సీతారాం పూర్ గ్రామానికి చెందిన మహేందర్ ఉమారాణి దంపతుల కుమార్తె అభినయ శ్రీ (4) తన మామయ్య తెలుగు రాంబాబు పెళ్లి (ఈ నెల 30న) నిమిత్తం చేవెళ్ల మండలం దామరిగిద్ద గ్రామానికి వచ్చారు.
Also Read:Kiren Rijiju: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు
ఇంటి ఎదుట ఉన్న రాంబాబు కారులో ఇద్దరు పిల్లలు సోమవారం మధ్యాహ్నం 12:30 నిమిషాల ప్రాంతంలో ఎక్కారు. ఆ తర్వాత కారు డోర్ లాక్ అయ్యింది. బంధువులు, కుటుంబ సభ్యులు ఇది గమనించ లేదు. బయట ఎక్కడో ఆడుకుంటున్నారని భావించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కారులో చూడగా ఆ ఇద్దరు చిన్నారులు స్పృహ తప్పి పడి ఉన్నారు. లాక్ తీసి కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read:KADAPA: ఒంటిమిట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన మంత్రి
పరీక్షించిన వైద్యులు చిన్నారులు మృతి చెందినట్లు నిర్దారించారు. ఇద్దరు చిన్నారులు డోర్ లాక్ అవ్వడంతో ఊపిరాడక మృతి చెందారు. దీంతో ఆ పిల్లల తల్లితండ్రుల రోదనలతో ఆసుపత్రి ప్రాగణం దద్దరిల్లింది. కంటికి రెప్పలా కాపాడుకున్న తమ కూతుర్లు విగతజీవులుగా మారడంతో గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయవిదారక ఘటన చూసిన ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు.