శ్రీవారి భక్తుల అలర్ట్. 2025 మార్చికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. ఇందులోనే లక్కీడిప్ కోటా కోసం డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేస్తుంది. వర్చువల్ సేవా టికెట్స్ అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటాయి.
డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10గంటలకు అంగ ప్రదక్షిణం కోటా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా.. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టోకెన్లను టీటీడీ విడుదల చేస్తుంది. డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు మార్చి 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా విడుదల ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ టికెట్స్ ఓపెన్ అవుతాయి. ఇక డిసెంబర్ 27న మార్చి నెల శ్రీవారి సేవ కోటా విడుదల అవుతాయి.