తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువుకు సిద్ధం అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.ఈ మేరకు నేడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేసింది.ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.గతంలో 2022 జూన్ 12 న టెట్ పరీక్షను నిర్వహించింది. తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే సెప్టెంబర్ 27న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు . ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. . పేపర్-1 పరీక్షకు డీఈడీ మరియు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇద్దరూ రాసుకునే అవకాశమును ఎన్సిటీఈ కల్పించింది.. బీఈడీ అర్హత కలిగిన అభ్యర్థులు పేపర్-2తోపాటు పేపర్-1 పరీక్ష కూడా రాసుకోవచ్చు.కాగా, ఇటీవల నిర్వహించిన సమావేశంలో టెట్ నిర్వహణకు తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలను రూపొందించి, విద్యాశాఖ కార్యదర్శికి అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణపై అధికారులు కసరత్తు చేసి నేడు నోటిఫికేషన్ను విడుదల చేసారు. ఈ టెట్ పరీక్ష కోసం రాష్టంలో 1.5 లక్షల డీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు అలాగే 4.5 లక్షల మంది బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో టెట్కు కేవలం 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉండగా రెండు సంవత్సరాల క్రితం టెట్ వ్యవధిని జీవితకాలం వరకు పొడిగించారు. పైగా గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పోటీపడే అవకాశం కేవలం డీఈడీ చేసిన వారికే ఉండగా ఇటీవలే బీఈడీ వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారితో పాటు బీఈడీ అభ్యర్థులకు ఎంతో ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది పైగా టెట్ క్వాలిఫై కానివారు వున్నారు.. వీరే కాకుండా కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారు మరో 20వేల వరకు ఉన్నట్లు సమాచారం.తాజా టెట్ నిర్వహణతో వీరందరికి మరోమారు పోటీపడే అవకాశం దక్కింది