తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను జులై 18, 19, 20 తేదీల్లో రెండు విడుతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు జులై 30, 31 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అయితే.. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీఎస్ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు జేఎన్టీయూలో విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఈ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఉదయం 11:45 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసెట్ ఫలితాల కోసం www.eamcet.tsche.ac.in వెబ్సైట్ను చూడొచ్చు. ఇదిలా ఉంటే.. భారీ వర్షాల కారణంగా గత నెలలో షెడ్యూల్ చేసిన ఎంసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే రెండు విడుతల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు.