Trainee IPS Case: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో నమోదైన కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో మహిళతో కూడా అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
అశోక్ నగర్లోని ఉదయ్ కృష్ణారెడ్డి నివాసంలో పోలీసులు సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా గదిలో నుంచి రెండు ప్రేమలేఖలు, ఒక ల్యాప్టాప్, సెల్ఫోన్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, కేసు దర్యాప్తులో భాగంగా విశ్లేషించనున్నారు.
ఈ విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వివాహిత మహిళతో కూడా ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. భర్తతో విడిపోయిన అనంతరం హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఆ మహిళతో అతడు సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం. అయితే విడాకుల తర్వాత తనతో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండాలని ఉదయ్ చేసిన ప్రతిపాదనను ఆమె తిరస్కరించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి, మరో మహిళ కలిసినట్లు విచారణలో వెల్లడైంది. ఆ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై ఇద్దరూ ఒకరితో ఒకరు తమ అనుభవాలు, బాధలను పంచుకున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి గదిలోకి బలవంతంగా ప్రవేశించి ఆమె మొబైల్ ఫోన్ను లాక్కున్నాడనే ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 20 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.

