సీఎం కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని లేఖలో ప్రస్తావించారు. బీసీ కుల గణన చేపట్టాలని సుదీర్ఘ కాలంగా డిమాండ్ ఉందని.. బీసీ జనగణన డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈ విషయంలో బీసీ సంఘాలు చేపట్టిన ప్రతి నిరసన, ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ఆమోదించిన సమయంలో కూడా తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారని అన్నారు.
Exam Pattern : AP లో కొత్త రూల్.. పరీక్షల విధానంలో మార్పులు..
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా బీహార్ రాష్ట్రంలో బీసీ జనగణనను విజయవంతంగా చేపట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఆ వివరాలను నిన్న విడుదల కూడా చేసిందని తెలిపారు. బీసీ కుల గణనతోనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ కుల గణనతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 ప్రకారం… విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
Delhi Earthquake: ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ జనగణన డిమాండ్ ను పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీనని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన మోడీ కూడా బీసీల న్యాయమైన డిమాండ్ ను నేరవేర్చడంలేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం కూడా బీసీ సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప చేసింది శూన్యమని ఆరోపించారు. బీసీ సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తెస్తామన్నా మాట ఉత్తముచ్చటగా మిగిలిపోయిందని తెలిపారు. తక్షణమే బీసీ కుల గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అప్పుడే సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు.