Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

నోటికివ‌చ్చిన‌ట్టు మాట్లాడటానికి సిగ్గుందా? బీఆర్‌ఎస్‌ నేతలపై భట్టి ఫైర్‌

ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు క‌ట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి వ‌ర్యులు భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో వేర్వేరుగా జ‌రిగిన‌ జూబ్లీహిల్స్, సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ కమిటీ నాయకుల సమావేశానికి డిప్యూటి సీఎం భ‌ట్టి హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర సంపదను, వనరులను దోపిడీ చేసిన గత బిఆర్ఎస్ పాలకులు రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకి నెట్టేసి పుట్టబోయే బిడ్డపై కూడా అప్పుల భారం మోపార‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పుట్టబోయే బిడ్డపై కూడా భారం మోపి ఆర్ధికంగా రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసిన గ‌త బిఆర్ఎస్ పాల‌కులు నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్ల‌డాటానికి సిగుండాల‌ని ఫైర్ అయ్యారు. పదేళ్ల పరిపాలన లో గత బిఆర్ఎస్ పాలకులు చేసిన దోపిడిని లెక్కలతో సహా బయటపెట్టి వారిని ప్ర‌జ‌ల ముందు దోషులుగా నిలబెడుతామ‌న్నారు.

పొరుగు దేశాలపై చైనా ప్రభావం.. భారత్ భయపడాల్సిన అవసరం లేదు..

భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావం గురించి పోటీ ఉంది, అయితే దీనిని భారత దౌత్య వైఫల్యంగా పేర్కొనడం తప్పు అని జైశంకర్ అన్నారు.

16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ

ఉత్తరప్రదేశ్‌లోని 16 లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్‌కు 11 సీట్లు కేటాయించినట్లు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి, షఫీకర్ రెహమాన్ బార్క్, రవిదాస్ మెహ్రోత్రా వరుసగా సంభాల్, లక్నో నుంచి పోటీ చేయనున్నారు. ఫిరోజాబాద్ నుంచి అక్షయ్‌ యాదవ్, ఎటా నుంచి దేవేశ్ శాఖ్యా, బదాయు నుంచి ధర్మేంద్ర యాదవ్, ఖేరీ నుంచి ఉత్కర్ష్ వర్మ, దౌర్హరా నుంచి ఆనంద్ బదౌరియా, ఉన్నావ్ నుంచి అను టాండన్‌, ఫరూఖాబాద్‌ నుంచి కిషోర్‌ శాఖ్య, అక్బర్‌పూర్‌ నుంచి రాజారాం పాల్, బందా నుంచి శివశంకర్ సింగ్ పటేల్, ఫైజాబాద్ నుంచి అవదేశ్‌ ప్రసాద్, అంబేడ్కర్‌ నగర్‌ నుంచి లాల్‌జీ వర్మ, బస్తీ నుంచి రామ్‌ప్రసాద్ చౌదరి, గోరఖ్‌పూర్‌ నుంచి శ్రీమతి కాజల్ నిషాద్‌ పోటీ చేయనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది.

మోడీకి క్షమాపణ చెప్పండి.. మాల్దీవుల అధ్యక్షుడికి సూచించిన..!

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల అధికార పార్టీ ఎంపీలు నోరు పారేసుకోవడంపై అంతర్జాతీయంగా తీవ్ర దుమారమే చెలరేగింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్దీవుల పర్యటనకు వెళ్లకూడదని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు. పలువురు తమ ప్రయాణాలు క్యాన్సిల్ కూడా చేసుకున్నారు. దీంతో ఆ దేశ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించాయి. భారత్‌ పట్ల ఇలాంటి వైఖరి మంచిది కాదని హితవు పలికాయి. మోడీకి, భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్..

చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆంబోతు వ్యాఖ్యలకు అంబటి పచ్చబొట్టు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నాడు.. అధికారికంలోకి వస్తే తనకు ముక్కుతాడు వేస్తాడట.. అధికారికంలో వచ్చేది లేదు, చచ్చేది లేదుని దుయ్యబట్టారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేతి పై పచ్చబొట్టు వేయిస్తానని అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసే రాజకీయ నాయకుడు అని వేయిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నన్ను గిల్లితే నేను గిల్లనా..? నన్ను ఆంబోతు రాంబాబు అంటే ఊరుకోవాలా..? పచ్చబొట్టు వేయిస్తాం అనటం కూడా తప్పు అవుతుందా? అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణి సంస్థపై అదానీకి కన్ను పడింది

బెల్లంపల్లి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమైన మూడు రోజులకే విదేశీ పర్యటనలు ఉన్న రేవంత్ రెడ్డిని అదానీ భేటీ అయి పెట్టుబడులు పెడతానంటూ సమావేశం ఏర్పాటు చేయడం, వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. సింగరేణి సంస్థపై అదానికి కన్ను పడిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి కేంద్రం వద్ద మోకరిల్లి తన కేసులు రద్దు చేసుకోవాలని తన గురువు పై ఉన్న కేసులను రద్దు చేసుకోవాలని రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. సింగరేణి కార్మికులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి .మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అని, రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో పార్టీని పార్టీ కార్యకర్తలని పట్టించుకోలేదని వాస్తవాన్ని అంగీకరిస్తున్నామన్నారు.

రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలి

దేశాన్ని ఏకం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు నిచ్చారు. దేశ సంపద ఈ ప్రజలకే చెందాలని రాహుల్ గాంధీ చేస్తున్న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేయాలని కోరారు. లౌకికవాదం కలిగిన ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడి బిడ్డనేన‌ని మతం పేరిట విభ‌జ‌న చేయ‌డం త‌గ‌ద‌న్నారు. మత విభజన పేరిట వైశ్యామ్యాలను సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలను పార్లమెంటు ఎన్నికల్లో దూరం పెట్టాలని ప్ర‌జ‌ల‌కు విజ్ఙ‌ప్తి చేశారు.

బడ్జెట్ సెషన్‌పై ఆల్‌పార్టీ మీటింగ్.. ఏం చర్చించారంటే..!

ఢిల్లీ: బుధవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక గురువారం (ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజలు, ఉద్యోగులు, అన్నదాతలు, రాష్ట్ర ప్రభుత్వాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి ఏమైనా వరాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తు్న్నారు. ఇక బడ్జెట్ మర్మమేంటో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

మావోయిస్టుల కాల్పులు.. ముగ్గురు జవాన్లు మృతి, 14 మందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని టేకల్‌గూడెం గ్రామంలో మంగళవారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ గ్రామం బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉంది. నక్సల్స్ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో క్యాంపును ఏర్పాటు చేశాయి. ఇది స్థానికులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. శిబిరాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, జొనాగూడ-అలిగూడ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ యొక్క కోబ్రా, జిల్లా రిజర్వ్ గ్రూపులు (DRGలు), స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ల సిబ్బందితో కూడిన బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు.

గ్రామాల్లో తాగునీటి నిర్వహణ సర్పంచ్ లకే

రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేవలం గోదావరి, కృష్ణా నదుల నుంచే రాష్ట్రమంతటికీ నీళ్లు ఇవ్వటం కాకుండా, కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లను తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుకు అనుగుణంగా కొత్త ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తాగు నీటిని సరఫరా చేయటం సులభమవుతుందని, తక్కువ ఖర్చుతో సాధ్యమవుతుందని అన్నారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక్సాగర్ లాంటి కొత్తగా ఏర్పడ్డ రిజర్వాయర్లన్నింటినీ తాగునీటికి వాడుకోవాలని అన్నారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి విభాగాలపై సమీక్ష నిర్వహించారు.

 

Exit mobile version