NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

వేణు స్వామిపై తెలంగాణ స్టేట్‌ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన టీఎఫ్‌జేఏ

నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం పైన వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రిటీస్‌పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది. వ్యక్తిగత విషయాలు నలుగురిలో మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా లేని వేణుస్వామి.. వాళ్ళు ఎప్పుడు విడి పోతారో కూడా చెప్పేశారు. నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల కలిసి ఉండరని, వారు విడాకులు తీసుకుంటారని, నాగచైతన్యకు సంతానం కలిగే అవకాశం లేదని వారిద్దరి జ్యోతిష్యాలను అనాలసిస్ చేసి చెప్పారు.

ప్రేమలో పడ్డ అన్నా- చెల్లెలు!.. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు అన్నా-చెల్లెలు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. పెద్దలు నిరాకరించడంతో చెరువులో దూరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. రాయపర్తి మండల కేంద్రం.. శివారులోని రామచంద్రునికి చెరువులో పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. చెరువు దగ్గర ఉండటంతో అటుగా వెళ్లిన పశువుల కాపరు చెరువులో మృతదేహాలను చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హన్మకొండ జిల్లా ఎనమాముల మండలం మద్దేగుడెం గ్రామానికి చెందిన సంగాల దిలీప్,(29)తిక్క అంజలి(25) గా గుర్తించారు.

సీఎం మమతకు ప్రియాంకాగాంధీ కీలక సూచన

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. హత్యాచారానికి గురైన తీరు మనసులను కలిచివేస్తోంది. ఇప్పటికే వైద్యులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు విధుల్లో చేరమంటూ వైద్యులు, నర్సులు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం విధించారు. ఇంకోవైపు ఈ కేసు సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ సహా విపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేస్తున్నాయి.

తాజాగా ఇదే వ్యవహారంపై కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ స్పందించారు. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన కలిచివేస్తుందన్నారు. ఈ ఘటన హృదయ విదారకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత అనేది దేశంలో పెద్ద సమస్యగా మారిపోయిందని.. దీనికి సమిష్ట కృషి అవసరం ఉందని తెలిపారు. హత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బాధిత కుటుంబానికి, సహచర వైద్యులకు న్యాయం చేయాలని ప్రియాంక ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికిగా సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.

కొరియా సంస్థలకు వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌ అనువైన గమ్యస్థానం

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సోమవారం వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్కును కొరియన్ కంపెనీల పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిపారు. ఈ పర్యటనలో ఆయన వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు , అధికారుల బృందం ఉన్నారు. “#KOFOTI (కొరియా టెక్స్‌టైల్ ఇండస్ట్రీ) నిర్వహించిన బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో కొరియన్ టెక్స్‌టైల్స్ కంపెనీల నుండి మరిన్ని పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా #వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్‌ని పిచ్ చేసాము,” అని తెలంగాణ CMO ద్వారా X లో పోస్ట్‌లో తెలిపారు. యంగ్‌గోన్‌ ఛైర్మన్‌ కిహాక్‌ సంగ్‌, కోఫోటీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌ కిహాక్‌ సంగ్‌, 25 ప్రముఖ టెక్స్‌టైల్‌ కంపెనీల అగ్రనేతలు అద్భుతమైన ఉత్సాహంతో స్పందించారని ఆయన తెలిపారు.

దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రాబోయే ఏడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల జాబితాను ఐఎండీ విడుదల చేసింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తూర్పు మరియు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అలాగే రాబోయే ఐదు రోజుల్లో కేరళ, తమిళనాడు, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ భారీ వర్షాలు కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష.. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై సీరియస్

వైద్యారోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో బాధపడేవారికి వివిధ రూపాల్లో పెన్షన్ అందిస్తున్నామని.. సదరం ఫేక్ సర్టిఫికేట్ల జారీపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్ల గురించి పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖతో సమన్వయం చేసుకుని ఫేక్ సదరం సర్టికెట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోనే బెస్ట్ హాస్పిటళ్లుగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దాలని సూచించారు.

వైద్య ఆరోగ్య శాఖలో ఉత్తమ విధానాలు అమలు చేయాలని.. టెలి మెడిసిన్ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టుపట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. కిడ్నీ బాధితుల వివరాలు మండలాల వారీగా సేకరించాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత తప్పనిసరి అని.. రోగులకు శుభ్రమైన బెడ్ షీట్లు అందించాలన్నారు. రాష్ట్రంలో డోలీ మోతలు కనిపించకూడదన్నారు. ఫీడర్ అంబులెన్సుల ద్వారా రోగులను తరలించాలన్నారు. ఫీడర్ అంబులెన్సులు వెళ్లగలిగినా.. సాధ్యం కాదని నిర్లక్ష్యం వహిస్తే నేరుగా తానే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తానన్నారు.104 అంబులెన్సుల పట్ల ప్రజల్లో సంతృప్తి ఉందా లేదా అన్నది ముఖ్యమని సీఎం వెల్లడించారు. ఏదో వెళ్లి కొన్ని టెస్టులు చేసి వచ్చి మొత్తం పరిష్కరించామని చెప్పడం సరి కాదన్నారు.

టూరిజం హబ్‌గా కిన్నెరసాని.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయాన్ని డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క, ఎక్సైజ్‌, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనమనేని సాంబశివరావు పరిశీలించారు. జిల్లా అధికారులతో కలిసి బోటులో కిన్నెరసాని జలాశయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. టూరిజం హబ్‌గా కిన్నెరసాని, హోలాండ్ తరహలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేవిధంగా ప్రణాళిక చేస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు అడవులు ఎకో టూరిజానికి అనువుగా ఉన్నాయని తెలిపారు. నేలకొండపల్లి లోని బౌద్ధ స్తూపం మొదలు జమలాపురం మీదుగా భద్రాచలంలోని సీతారాముల ఆలయం వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు.

అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం

ఏపీలో అమరావతి నిర్మాణం పనులు వేగంగా జరగుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. రాజధాని నిర్మాణానికి విరాళాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. విరాళం ఇచ్చేదుందుకు మంత్రులు కూడా ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. సంబంధిత ₹3,01,116/- రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సచివాలయంలో అందజేశారు. విరాళం అందించిన మంత్రిని సీఎం చంద్రబాబు అభినందించారు.

పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి.. సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

పారిశుద్ధం పై ప్రత్యేక దృష్టి సాధించాలనీ, వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లా గా తీర్చిదిద్దాలని పంచాయితీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ, గృహనిర్మాణ శాఖ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క (అనసూయ) అధికారులను ఆదేశించారు. స్వచ్ఛధనం పచ్చదనం ప్రత్యేక 5 రోజుల కార్యక్రమంలో చేపట్టిన పారిశుద్ధ్య పనుల ప్రగతి పై సమీక్షించుకుని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ గా కొనసాగాలని ఆన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై, వరదలు విష జ్వరాలు హాస్టల్స్ స్కూల్ లలో సమస్యలు, మిషన్ భగీరథ ,వైద్యం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి కేంద్రాల పై మంత్రి సమీక్షించారు.

స్కూల్ వ్యాన్‌ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె హైవే క్రాస్ సమీపంలో స్కూల్ వ్యాను బోల్తాపడిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో భవిష్య అనే చిన్నారి మృతి చెందడంపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ అధికారులు డ్రైవ్ నిర్వహించాలని, ఫిట్ నెస్ లేకుండా స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె సమీపంలో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థని అక్కడికక్కడ మృతి చెందగా.. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఓబులవారిపల్లె నుంచి సమీపంలోని శ్రీవాణి ప్రైవేటు పాఠశాలకు 20 మంది విద్యార్థులతో బస్సు బయలుదేరగా.. ఓబులవారిపల్లె దాటిన తర్వాత ఓ చిన్న వంతెన వద్ద వెనక టైరు పొరపాటున రాయి ఎక్కడంతో బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో రెండో తరగతి విద్యార్థిని భవిష్య(8) మృతి చెందింది. ఈ ఘటన అనంతరం బస్సు డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ బస్సును ఎలాంటి కండిషన్‌ లేకుండా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌పై సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.