పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలే..
పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాతో చంద్రబాబు ఉమ్మడి సభలు పెట్టిస్తున్నాడన్నారు. మరి వాళ్లందరి దగ్గర నుంచి ప్రజలు ఏమి ఆశించారు.. మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు.
ఒక వర్గం ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు…
పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, సమాజాన్ని కులం, భాష పేరుతో విభజన చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచ్ఛిన్న కర శక్తులకు ఆ పార్టీ టిక్కెట్లు కూడా ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణం కాంగ్రెస్ చర్యలు అని ఆయన ఆరోపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీ నాయకులు విదేశాల్లో మాట్లాడారని, రాహుల్ గాంధీ గురువు, రాజీవ్ గాంధీ అడ్వైజర్ శాం పిట్రోడ.. భారతీయుల పై విషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. ఇది జాత్యహంకారం కు నిదర్శనమన్నార లక్ష్మణ్. రాహుల్, సోనియా, ప్రియాంకా ఖండించకపోవడం దేశం పట్ల వారికున్న గౌరవం ఏంటో తెలుస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విధాన పరమైన ఆలోచనలు ప్రజల ముందు శాం పిట్రోడ పెట్టారని, శాం పిట్రోడా రాజీనామా ఒక డ్రామా… నష్ట నివారణ చర్య మాత్రమే అన్నారు. శాం పిట్రోడ ను బహిస్కరించాలి.. ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు లక్ష్మణ్.
డీబీటీ పథకాల అమలు.. తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు
ఏపీలో సంక్షేమ పథకాలకు నగదు విడుదలను ఎన్నికల సంఘం నిలిపివేయడంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పిటిషనర్, ఈసీ, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. డీబీటీ పథకాలకు అనుమతి ఇవ్వలేమని కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది ఎన్నికల సంఘం. సుమారు 5 గంటల పాటు వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేశారు. సంక్షేమ పథకాల లబ్దిదారులకు నగదు జమ చేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అత్యవసర సేవల్లో ఉన్న కరువు మండలాల్లో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాద వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియ జూన్6తో పూర్తవుతుందని ముందుగా ఈసీ జూన్ 6 తర్వాత నగదు జమ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టుకు ఈసీ న్యాయవాది అవినాష్ దేశాయ్ తెలిపారు. తమకు వచ్చిన వినతి పత్రాల పునః పరిశీలన తర్వాత జూన్ 6వ తేదీని పోలింగ్ తేదీ అంటే మే 13 తర్వాత నగదు జమ చేసుకోవచ్చని కోర్టుకు ఈసీ తెలిపింది. పోలింగ్కి ముందు ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధమని కోర్టుకు ఈసీ విన్నవించింది. గతంలో ఎన్నికల సమయంలో నగదు జమ, 2019లో పసుపు కుంకుమ డబ్బు జమ వంటి విషయాలను ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెలో ఉండాలి
గత 25 ఏళ్లుగా మెదక్ పార్లమెంటు బీజేపీ, బీఆర్ఎస్ చేతిలో నలిగిపోయిందని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ నర్సాపూర్లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందుకే రాహుల్ గాంధీ నీలం మధుని మెదక్ నుంచి బరిలో నిలిపారని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని దుబ్బాకలో బండకేసి కొడితే ఇక్కడికి వచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లన్నసాగర్ లో వేలాది మంది రైతుల భూములను గుంజుకున్నాడని, మన భూములు గంజుకున్న వెంకట్రామిరెడ్డి ని ఓడించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, హరీష్ రావుకు వందల కోట్లు ఇచ్చినందుకే వెంకట్రామిరెడ్డి కి టికెట్ ఇచ్చారని, మెదక్ లో ఒక్కమగాడు కూడా కేసీఆర్ కి దొరకలేదా అని ఆయన వ్యాఖ్యానించారు.
సూపర్ సిక్స్ పెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకువస్తాం..
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ కార్యక్రమాలను పెంచుతానని.. ప్రజల ఆదాయన్ని పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ పేదవాళ్ల పార్టీ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. చీపురుపల్లిలో గంజాయి దొరుకుతుందని.. బొత్స సత్యనారాయణకు చేతనైతే గంజాయి లేకుండా చేయాలని ఆరోపించారు. విశాఖలో 40 వేల కోట్ల విలువ చేసే ఆస్తులను కబ్జా చేశారని.. విశాఖను గంజాయి హబ్గా మార్చేశారని విమర్శించారు. రేపు జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మాన్ని కాపాడాలని.. మన భవిష్యత్ను మనం పరి రక్షించుకోవాలన్నారు. ఓటు మీ హక్కు, మీ దగ్గర ఉండే ఆయుధమని, మీ జీవితాన్ని మార్చే ఆయుధమంటూ ఆయన పేర్కొన్నారు. అనుభవం అంతా ఉపయోగించి మీరు ఊహించని అభివృద్ధిని చేస్తా అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏమర పాటు వద్దని.. ఎండ ఉందని ఇంట్లో పడుకోవద్దు.. అందరూ ఓటు వేయాలని సూచించారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు టీటీడీ ఛైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్జి. తిరుపతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి దొంగలు పడ్డారంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావో, అదే ఏడాది నుంచి తాను రాజకీయాలు ప్రారంభించానని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ సంస్కార హీనుడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా అన్యాయం జరిగింది అంటే మాకు ఓటు వేయొద్దని.. అభివృద్ది చూసి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినందుకు ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు.
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్..
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధంమవుతోంది. మరో రెండు రోజుల్లో కీలకమైన ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ క్రమంలో.. అన్ని రాజకీ పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. తమ ప్రభుత్వంలో చేసి అభివృద్ధి, సంక్షేమం, మంచి పనులు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి మరోసారి ఆశీర్వాదించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో.. సీఎం జగన్ రాష్ట్రాన్ని మొత్తం చుట్టేశారు. కాగా.. రేపు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాది
నర్సాపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో కాంగ్రస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం రాకముందు అత్తాడుగువర్గాల వారికీ ఎటువంటి హక్కులు లేవని, రాజ్యాంగం వచ్చాకే మనకు హక్కులు వచ్చాయన్నారు. ఈ రాజ్యాంగం మన కోసం మనం రాసుకోవడానికి అనేకమంది తమ రక్తాన్ని ధారాబోశారని, బీజేపీ అగ్ర నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగంగా చెబుతున్నారన్నారు రాహుల్ గాంధీ. మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని అంటుందని, రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత మాదని ఆయన వ్యాఖ్యానించారు. మనకి ఓటు వేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, మోడీ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటు పరం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లు తీసేయడానికే మోడీ ఇలా కుట్ర చేస్తున్నారని, రిజర్వేషన్లు తీసేయాలని బిజెపి అంటుంది…మేము 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు రాహుల్ గాంధీ.
కేటీఆర్ రోడ్ షో లో ఉద్రిక్తత.. టమాటాలు విసిరిన హనుమాన్ దీక్షాపరులు
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ కు ముందే హనుమాన్ దీక్షాపరులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గతంలో కేటీఆర్ జై శ్రీరామ్ అనే మాట అన్నం పెడుతుందా..! అని అన్న వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ మాలధారులు జై శ్రీరాం నినాదాలు చేస్తూ కేటీఆర్ రాకకు నిరసన తెలిపారు. కొద్దిసేపు పోలీసులకు, స్వాములకు మధ్య తోపులాట జరిగింది.