Site icon NTV Telugu

Top Headlines@9AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

*నేడు రాప్తాడులో ‘సిద్ధం’ సభ… పాల్గొననున్న సీఎం జగన్
నేడు అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. రాప్తాడులో జరిగే ‘సిద్ధం’ బహిరంగ సభకు సీఎం జగన్‌ హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైసీపీ శ్రేణులు భారీగా తరలిరానున్నారు. మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించిన వైసీపీ.. మరో సభ నిర్వహిస్తోంది. రాప్తాడులోని ఆటోనగర్ వద్ద 110 ఎకరాల్లో సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. ఈ సభను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ రాప్తాడు సిద్ధం సభతో మూడు సభలు పూర్తి కానున్నాయి. త్వరలో పల్నాడులో మరో సభ నిర్వహించనున్నట్లు తెలిసింది. సభ పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. ఇక.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమేనని.. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు.

 

*ఆంధ్ర ప్రదేశ్ లోకి బర్డ్ ఫ్లూ ఎంట్రీ.. ఈ జిల్లాలో చికెన్ అమ్మకం నిషేధం
ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం వ్యాప్తి పక్షుల మధ్య మాత్రమే, సాధారణ ప్రజలలో ఇంకా వ్యాప్తి చెందలేదు. బాధిత గ్రామాలకు కిలోమీటరు పరిధిలో కోళ్ల విక్రయాలు, ఉంచడాన్ని జిల్లా యంత్రాంగం మూడు నెలల పాటు నిషేధించింది. మూడు రోజుల పాటు 10 కిలోమీటర్ల పరిధిలో చికెన్ విక్రయాలు ఉండవు. పొదలకూరు మండలం చాటగట్ల గ్రామం, కొవ్వూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామంలో ఈ వ్యాధి ప్రబలింది. 15 రోజుల పాటు ఈ ప్రాంతంలోకి, వెలుపల పౌల్ట్రీ తరలింపును కూడా నిషేధించారు. భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కి నమూనాలను పంపగా, కోళ్లు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వల్లే చనిపోయాయని నిర్ధారించారు. కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కృష్ణా, గోదావరి జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో సూచించారు. వలస పక్షులు ఎక్కువగా ఉండే నెల్లూరు, కడప, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాల్లో ర్యాపిడ్ టీంలను ఏర్పాటు చేశారు. 712 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు రాష్ట్రంలో పర్యవేక్షిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని రెండు గ్రామాలు మినహా రాష్ట్రంలో ఎక్కడా వ్యాధి ప్రబలడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా, తమిళనాడు ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ నివారణ చర్యలు తీసుకోవాలని సరిహద్దు జిల్లాల ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్లను కోరింది. తిరువళ్లూరు, రాణిపేట్, వేలూరు, తిరుపత్తూరు, కృష్ణగిరి డిప్యూటీ డైరెక్టర్లకు రాసిన లేఖలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ టి.సెల్వవినాయకం నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఒక మీడియా కథనంలో మాట్లాడుతూ 10 వేలకు పైగా కోళ్ల పక్షులు ఉన్నాయని తెలిపారు. గత 10 రోజుల్లో జిల్లాలో చాలా మంది చనిపోయారు. హెచ్‌5ఎన్‌1 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌ వల్ల ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా ప్రబలినట్లు నిర్ధారించామని, నివారణ, నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందికి దిశానిర్దేశం చేయడం, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లకు శిక్షణ ఇవ్వడంతోపాటు నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ఫ్లూ లాంటి వ్యాధిని పర్యవేక్షించాలని సూచనల్లో పేర్కొన్నారు. బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి కోళ్ల పెంపకంలో నిమగ్నమైన వారు జాగ్రత్త వహించాలి. ఆసుపత్రులు కేసులను నిర్వహించడానికి, కీమోప్రొఫిలాక్సిస్‌లో సహాయం చేయడానికి, చర్య కోసం పశుసంవర్ధక శాఖతో సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పశుసంవర్థక శాఖ కోరిన విధంగా చెక్‌పోస్టుల వద్ద మెడికల్‌, పారామెడికల్‌ బృందాలను నియమించాలి. క్షేత్ర సిబ్బంది గమనించిన కాకులు, బాతులు, కోళ్లు మరియు ఇతర పక్షులు వ్యాధి మరణాలు వెంటనే జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్ (AH) కు నివేదించాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని, సోకిన వ్యక్తులు చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పద్ధతులు, మాస్క్‌లు ధరించడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు.

 

*జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలింటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సీరియస్ అయిన ప్రభుత్వం.. గుంటూరు న్యాయస్థానంలో కేసు దాఖలు చేసింది. గతేడాది జులై 9న ఆయన వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో కేసు పెట్టింది. ఈ క్రమంలో 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసిన జిల్లా కోర్టు.. కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. పవన్‌ కల్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. గతేడాది జులై 9న పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని అన్నారు. వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని తెలిపారు. జూలై 9న వారాహి యాత్రలో ఏలూరులో రాష్ట్రంలో వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అంటూ పవన్ ఆరోపణలు చేశారు. తాడికొండ మండలం కంతేరుకి చెందిన వాలంటీర్ పవన్ కుమార్‌తో పాటు మరి కొందరు ఇచ్చిన వాంగ్మూలంపై కేసు నమోదు చేస్తున్నట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.

 

*భక్తులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి మే నెల దర్శన టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో మే నెల దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన చేసింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు లక్కిడిఫ్ విధానంలో పొందడానికి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని టీటీడీ పేర్కొంది. ఇక 21వ తేదీ మధ్యహ్నం 12 గంటల నుంచి 23వ తేది మధ్యాహ్నం 12 గంటల వరకు లక్కిడిఫ్ విధానంలో టికెట్లు పొందిన భక్తులు వాటిని ఆన్‌లైన్ విధానంలో పేపేంట్ చేసి టికెట్లు పొందేందుకు గడువు ఉంటుంది. అటు ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం, 11 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

 

*హత్యకు గురైన తహసీల్దార్‌ రమణయ్య ఇంట్లో మరో విషాదం
విశాఖలో హత్యకు గురైన తహసీల్దార్‌ రమణయ్య ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తహసీల్దార్‌ రమణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. తహసీల్దార్‌ రమణయ్యకు వరుసకు సోదరుడు రాజేంద్ర మృతి చెందారు, గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో రాజేంద్ర బాధపడుతున్నాడు. తహశీల్దార్ రమణయ్య హత్య జరిగిన రోజు పొంతన లేని విషయాలు చెప్పాడట రాజేంద్ర. చీపురుపల్లిలో భూమి వివాదంలో ప్రసాద్ అనే వ్యక్తి…తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేశాడు రాజేంద్ర. తహసీల్దార్ రమణయ్య హత్య కేసుతో సంబంధం లేని విషయాలను ప్రచారంలోకి తేవడంపై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిందితుడు గంగారాం అరెస్టుతో కేసు విచారణలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..ఇప్పుడు రాజేంద్ర మృతిపై కూడా విచారణ చేస్తున్నారు.

 

*మేడారంలో తక్షణ వైద్య సేవలు.. అందుబాటులో 40 బైక్ అంబులెన్స్‎లు
వనదేవతల దర్శనం కోసం మేడారం వచ్చే భక్తులకు అవసరమైన వైద్యసేవలు అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జాతరలో నిరంతర వైద్య సదుపాయం కల్పించాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ మహాజాతరలో దాదాపు లక్షన్నర మంది జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున అత్యవసర సేవలను అందించేందుకు బైక్ అంబులెన్స్ సేవలను జాతరలో ప్రారంభించారు. ఈ మేరకు శనివారం మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో మంత్రి సీతక్క అధికారులతో కలిసి బైక్ అంబులెన్స్ లను ప్రారంభించారు. మొత్తం 40 బైక్ అంబులెన్స్‌లను ప్రారంభించనున్నారు. వాటిలో దాదాపు 21 రకాల మెడికల్ కిట్ అందుబాటులో ఉంటాయని, వాటితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతరలో ఏటికేడు భక్తుల రద్దీ పెరుగుతోందని, అత్యవసర సమయాల్లో భక్తులకు వైద్యసేవలు అందించేందుకు కొత్త బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మేడారం జాతరలో భక్తులకు విస్తృతంగా వైద్యసేవలు అందించాలని, పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. డాక్టర్లు దేవుడితో సమానమని, అమ్మ పుడితే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారన్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అన్ని రకాల వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. జాతరకు వచ్చే భక్తులు సమన్వయంతో వనదేవతలను దర్శించుకోవాలని, అత్యవసర సమయాల్లో సేవలు అందించే అంబులెన్సులకు సహకరించాలని కోరారు. మేడారం జాతరకు తరలివస్తున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని 40 జీవీకే బైక్‌ అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్లు మెడికల్‌ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ స్పష్టం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం వైద్య సిబ్బంది ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జంపన్న వాగు పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్యూలైన్లలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, పరిష్కారాలు అందించాలని సూచించారు. సమ్మక్క సారలమ్మ మహాజాతరకు తరలివచ్చే భక్తులకు వైద్య సేవలందించేందుకు మేడారంలో 50 పడకలతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి దామోదర రాజనర్సింహ గత నెలలోనే రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు మేడారం జాతరలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. మేడారంలోని ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో నిపుణులైన వైద్యులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని సూచించారు. మేడారం వెళ్లే మార్గంలో 42 వైద్య శిబిరాలు, జాతర పరిసరాల్లో 30 వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి శిబిరంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అవసరమైన అన్ని మందులు, ఎమర్జెన్సీ మెడికల్ కిట్‌లను సిద్ధంగా ఉంచాలన్నారు. జాతరలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వీలైనంత త్వరగా రోగులను వైద్య శిబిరాలు, సమీపంలోని ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య శిబిరాల్లో చికిత్స అనంతరం ఉన్నత స్థాయి వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా ఆసుపత్రులకు, వరంగల్ ఎంజీఎంకు తరలించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు మేడారం జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

 

*మధ్యప్రదేశ్‌లో దారుణం.. గర్భిణిపై సామూహిక అత్యాచారం, ఆపై నిప్పంటించి..!
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 34 ఏళ్ల గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి.. ఆపై నిప్పంటించారు. ఈ దారుణ ఘటన మొరెనా జిల్లా అంబాహ్ పట్టణానికి సమీపంలోని చాంద్ కా పురా గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు ప్రస్తుతం గ్వాలియర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 80 శాతం కాలిన గాయాలతో ఆ మహిళ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంబాహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అలోక్ పరిహార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త మీద అత్యాచార ఆరోపణలు చేసిన ఓ మహిళతో రాజీ కుదుర్చుకునేందుకు ఆ గర్భిణి చాంద్ కా పురా గ్రామానికి వెళ్లింది. ఆ మహిళ భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గర్భిణిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ మహిళ, ఈ ముగ్గురు కలిసి బాధితురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గర్భిణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఆ,ఆమెను కాపాడారు. ప్రస్తుతం బాధితురాలు గ్వాలియర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనపై ముందుగా సామూహిక అత్యాచారం చేసి, ఆపై ముగ్గురు పురుషులు కలిసి నిప్పంటించారని బాధితురాలు వీడియోలో పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ నమోదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితురాలైన మహిళ భర్త గతంలో ఓ అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు సమాచారం.

 

*తమిళనాడు పీసీసీ చీఫ్, సీఎల్పీ నేతల మార్పు
సార్వత్రిక ఎన్నికల ముందు తమిళనాడు కాంగ్రెస్‌లో మార్పులు.. చేర్పులు చోటుచేసుకున్నాయి. తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా కెఎస్. అళగిరి స్థానంలో సెల్వపెరుంతగై నియమితులయ్యారు. అలాగే తమిళనాడు సీఎల్పీ నేతగా ఎస్.రాజేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. తమిళనాడు కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న అంతర్గత తగాదాలు కారణంగానే మార్పులు చోటుచేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అళగిరిపై కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నట్లు అధిష్టానం గుర్తించింది. ఈ నేపథ్యంలో అళగిరిని తప్పించి కొత్త అధ్యక్షుడిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక ముఖ్యమైన పరిణామం కారణంగా KS అళగిరి స్థానంలో K. సెల్వపెరుంతగైని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే తమిళనాడు సీఎల్‌పీ నాయకుడిగా ఎస్.రాజేష్ కుమార్‌ను నియమించారు. తమిళనాడులో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 23 మంది సభ్యుల ఎన్నికల కమిటీకి సారథ్యం వహించడానికి KS అళగిరిని నియమించింది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. ఈ కమిటీలో ప్రముఖ నాయకులు కె. సెల్వ పెరుంతగై, పి. చిదంబరం, కుమారి అనాథన్ మరియు ఇతరులు ఉన్నారు.

 

*బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే?
గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈ మధ్య కాలంలో కాస్త శాంతించాయి. పసిడి ధరల్లో పెద్దగా తగ్గుదల కనిపించకపోయినా.. పెరుగుదలకు మాత్రం అడ్డుకట్ట పడింది. అయితే వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (ఫిబ్రవరి 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400గా ఉంది. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.62,550గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200గా.. 24 క్యారెట్ల ధర రూ.62,400గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,800 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,050గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.62,400గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,400గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో నేడు కిలో వెండి ధర రూ.76,500లుగా కొనసాగుతోంది. నేడు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,500గా ఉండగా.. ముంబైలో రూ.76,500 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 కాగా.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో రూ.78,000లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,000గా ఉంది.

Exit mobile version