ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్:
ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాల్-ప్రతి సవాల్తో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు. దాంతో ఇరువురు నేతలు బహిరంగ చర్చకు సిద్ధం అయ్యారు. దాంతో అనపర్తిలో ఏమి జరుగుతుందంటూ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు:
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. శుక్రవారం మొదటి ఏడాది, శనివారం రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్ష జరగనుంది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షకు అనుమతించరు.
నేడే చలో మేడిగడ్డ:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నేడు చలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను సందర్శించి సమీక్షలు నిర్వహించి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే.. బీఆర్ఎస్ పర్యటనకు కూడా పిలుపునిచ్చారు. మార్చి 1న మేడిగడ్డకు.. నేడు ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డనే కాదు, ఇతర బ్యారేజీలు, పంపుహౌజ్లు అంటూ కాంగ్రెస్ మాటలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ వరకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, పార్టీ నేతలతో బయలుదేరి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజా ప్రతినిధులు. చలో మేడిగడ్డ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ దిశానిర్దేశం చేశారు.
నగరంలో స్కార్లెట్ ఫీవర్ కలకలం:
నగరంలోని చిన్న పిల్లల ఆస్పత్రిలో స్కార్లెట్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఒకవైపు పరీక్షలు ప్రారంభమయ్యే తరుణంలో చిన్నారులను ఈ వ్యాధి పీడిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రిలోని పిల్లల వార్డుకు వచ్చే 20 మంది జ్వర బాధితుల్లో 10-12 మందికి ఈ స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఈ వ్యాధి వచ్చినా కాస్త తగ్గింది. మళ్లీ ఇటీవలి కాలంలో పిల్లలపై విజృంభిస్తోంది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే చిన్నారుల్లో ఈ జ్వరం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. వైరల్ లక్షణమని భావించి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే.. ఆస్పత్రికి చేరేంత ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించాలని సూచిస్తున్నారు. స్కార్లెట్ ఫీవర్ స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ సమస్య ఉన్న పిల్లలు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆతుంతపర్లు పక్కన వున్న పిల్లలకు అంటుకుంటుంది.
జ్ఞాన్వాపి పూజలపై సుప్రీంకోర్టులో విచారణ:
వారణాసిలోని జ్ఞాన్వాపి వ్యాస్జీ బేస్మెంట్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. జ్ఞానవాపిలో పూజను కొనసాగించాలన్న అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని ముస్లిం పక్షం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. వాస్తవానికి, అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సవాలు చేసింది, ఇందులో యాజమాన్యం కోరుతూ మొత్తం ఐదు పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. అంతేకాకుండా, వ్యాస్ జీ నేలమాళిగలో పూజను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. ప్రార్థనా స్థలాల చట్టం-1991లో అలహాబాద్ హైకోర్టు జోక్యం సరికాదని ముస్లిం పక్షం చెబుతోంది. మసీదు కాంప్లెక్స్లో భాగంగా ఉన్న వ్యాస్ జీ నేలమాళిగ వారి ఆధీనంలో ఉందని, వ్యాస్ కుటుంబానికి లేదా మరెవరికీ నేలమాళిగలో పూజలు చేసే హక్కు లేదని మసీదు కమిటీ వాదించింది. సుప్రీం కోర్టులో విచారణ సమయంలో హిందూ పక్షం కూడా ఉంటుంది.
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం:
బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లా రాజధాని ఢాకాలోని ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగి.. కనీసం 44 మంది మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. చాలా మంది అపస్మారక స్థితిలో ఉండగా.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
సినిమాలకు బ్రేక్ తీసుకోనున్న శ్రీలీల:
ప్రస్తుతం టాలివుడ్ ఇండస్ట్రీలో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ టాక్ సొంతం చేసుకుంది. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది. ప్రస్తుతం శ్రీలీల గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది. ఇక శ్రీలీలా సినిమాలకు బ్రేక్ తీసుకుంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎమ్బీబీఎస్ చదువుతూనే సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ. కెరీర్, చదువూ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక శ్రీలీల తల్లి కూడా డాక్టర్ కావడం విశేషం. అయితే పరీక్షల కోసం శ్రీలీల బ్రేక్ తీసకున్నప్పటికీ ఆమె ఇప్పటివరకూ కొత్త సినిమాకి సైన్ చేయకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.