నేను సీఎం చంద్రబాబుకి ఏకలవ్య శిష్యురాలిని..
అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంప్ కార్యాలయ దగ్గర ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేసింది హోం మంత్రి. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదలకు అన్నదానం ఏర్పాటు చేసి, భోజనాలు ఒడ్డించారు మంత్రి అనిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాకు దైవ సమానులైన చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. చంద్రబాబు ఒక విజనరీ లీడర్.. చంద్రబాబు హాయాంలో మేము పని చేయడం పూర్వజన్మసుకృతం.. భావితరాల భవిష్యత్ కోసం అలు పెరుగని పోరాటం చేస్తున్న యోధుడు అని మంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చింది.
నేను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదు!
తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని, నిన్న హైడ్రా కూల్చివేసిన సర్వే నంబర్పై ఎలాంటి కేసు లేదని టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే 79/1, 79/2 సర్వే నంబర్ రెగ్యులరైజ్ అయ్యిందని.. గతంలో అన్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు తమది కుడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారన్నారు. అన్ని డాక్యుమెంట్స్ నెల రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్కి స్వయంగా అందించానని, ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్ చర్యలపై రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నామని, కోర్టులపై తమాకు పూర్తి నమ్మకం ఉందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు.
ఆరోగ్య సమస్యల వల్ల దుబాయ్ వెళ్లా.. కార్యకర్తలకు దూరమయ్యా!
ఆరోగ్య సమస్యల వల్ల తాను దుబాయ్ వెళ్లానని, కార్యకర్తలకు దూరమయ్యానని బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టొద్దని సీపీకి విన్నపం చేశానన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన కొడుకుపై కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 27న వరంగల్లో బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ జరగనుంది. రజతోత్సవ సన్నాహాక సమావేశ కార్యక్రమం బోధన్ అప్న ఫంకషన్లో ఈరోజు జరిగింది. మాజీ ఎమ్మెల్యే షేకీల్, బీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అక్రమ సంబంధం అనుమానంతో భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడి..
తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో జరిగింది. తిక్రి గ్రామంలో ఈ దాడి జరిగింది. భర్త రామ్ గోపాల్ శుక్రవారం రాత్రి తన భార్య 39 ఏళ్ల రాంగుని, కుమార్తెలైన 16 ఏళ్ల నేహా, 23 ఏళ్ల రచితపై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలు తన ఇద్దరు కుమార్తెలతో, ఒక కొడుకుతో తిక్రి గ్రామంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త రామ్ గోపాల్ షహాబాద్ హర్దోయ్లో నివసిస్తున్నాడని ఏఎస్పీ దేవేంద్ర కుమార్ ఆదివారం తెలిపారు. శుక్రవారం రాత్రి రాంగుని, ఆమె కుమార్తెలు నిద్రిస్తున్న సమయంలో, రామ్ గోపాల్ గోడ దూకి ఇంట్లోకి చొరబడి, వారిపై యాసిడ్ దాడి చేసినట్లు వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో రాంగుని కుమారుడు అషు స్నేహితుడితో కలిసి ఉండటంతో అతడు దాడి నుంచి బయటపడ్డాడు.
ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా..?
పెద్దపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలో దారుసలామ్ మీటింగ్ పెట్టడం అన్యాయమే కాదు, పేద ముస్లింలకు గుణపాఠం చెబుతోందని మండిపడ్డారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పేద ముస్లింల పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. వక్ఫ్ బిల్లును పేద ముస్లింల కోసం తీసుకువచ్చినట్లు చెప్పిన సంజయ్, “బడాబాబులు, బడా చోర్లు కలిసి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు. ఎవరి కోసం? పేదల కోసం కాదు!” అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అలాగే, బాబా సాహెబ్ అంబేద్కర్ పై అవమానం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. “ఎంఐఎం ఏదైనా ఒక్కసారైనా అంబేద్కర్ జయంతి, వర్థంతి చేసింది? ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా?” అంటూ ప్రశ్నించారు. వక్ఫ్ భూములపై వివరణ ఇస్తూ, “హర్యానాలో సిక్కుల దేవాలయం, రైల్వే స్టేషన్, పార్లమెంటు భవనాలపై వక్ఫ్ హక్కులు అంటున్నారు. అయోధ్యలో రాముడి పుట్టిన స్థలానికి ఆధారం అడుగుతున్నారు. మీ జాతికి ఒక న్యాయం, మా జాతికి ఇంకో న్యాయమా?” అని కేంద్ర మంత్రి నిలదీశారు.
చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై పుస్తకాల ఆవిష్కరణ..
అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు. ఐటీ విప్లవం వచ్చిన వెంటనే తెలుగు జాతికి దీని ఫలాలు అందించాలని భావించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ అన్నారు. కంప్యూటర్ కూడు పెడుతుందా అని అప్పట్లో తప్పుడు ప్రచారం చేయడంతో ఓ ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోయారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు నాడు చేసిన కృషి వల్ల ప్రతి రైతు, ప్రతికూలీ, ప్రతి కార్మికుడి ఇంట్లో ఓ ఐటీ ఉద్యోగి వచ్చారని వెల్లడించారు. వారు అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ తల్లితండ్రులకు పంపిస్తూ ఇటు రాష్ట్ర సంపదని పెంపొందిస్తున్నారన్నారు. ఇప్పుడా హైదరాబాదు సంపద ఉపాధి కేంద్రంగా మారింది అలాగే అమరావతి కూడా మనకు నిర్మితం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుతే లేదు అంధకారమే ఉండేదన్నారు.
మరో యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్.. షర్ట్పై కీలక అంశం రాసి సూసైడ్..
ఆన్లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగ్లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జైచంద్రగా గుర్తించారు. ఆన్లైన్ గేమ్స్, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవద్దంటూ షర్ట్పై రాసుకున్నాడు యువకుడు. అయితే.. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సమాజంలో బెట్టింగ్లు తొలుత సరదాగా మొదలై చివరికది వ్యసనంగా మారుతున్నాయి. బెట్టింగ్ భూతం బారిన పడి ఎంతోమంది బలైపోతున్నారు. ఆ ఉచ్చులోంచి బయటపడలేక ఏదో ఒక రోజు గెలుస్తామని సమాధానం చెప్పుకుంటూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, హోటళ్లు, టీకేఫ్లు, పార్కులు, క్రీడామైదానాలు ఇలా ఎక్కడబడితే అక్కడ యువత, విద్యార్థులు పనులు మానుకుని మరీ గంటలసేపు ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోయి గొడవలకు దిగుతున్నారు. ఇలాంటిచోట పోలీసులు నిఘా పెంచితే కొంతవరకైనా ఫలితం ఉంటుంది.
పేద రైతుల కోసమే భూభారతి చట్టం
జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో శనివారం జరిగిన “భూభారతి 2025” చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తీసుకొచ్చిన భూభారతి చట్టం పేద రైతులకు మహా ప్రసాదంగా నిలుస్తుందని చెప్పారు. పొంగులేటి ధరణి చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తూ, అది కొద్ది మంది వ్యక్తులు, నాలుగు గోడల మధ్య కూర్చొని తయారు చేసిన చట్టమని విమర్శించారు. ఇది పేద ప్రజలను, చిన్న రైతులను అణచివేయడానికి ఉపయోగపడిందని ఆరోపించారు. అందుకే సీఎం రేవంత్ ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు.
హాస్పిటల్లోనే హానికరపు అలవాట్లు.. నిమ్స్ మంటల మిస్టరీ..!
హైదరాబాదులోని నిమ్స్ (NIMS) హాస్పిటల్లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, పలు కీలక విషయాలు బయటపడ్డాయి. ఘటనకు గల ప్రధాన కారణం సిగరెట్, చెత్త వల్లేనని పోలీసులు తేల్చారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పందిస్తూ, వేగంగా మంటలను అదుపులోకి తెచ్చారు. గంట వ్యవధిలోనే మంటల్ని కంట్రోల్ చేసిన ఫైర్ టీమ్ మెరుగైన చర్యలందించింది. అయితే మంటల వెనుక గల అసలు కారణం మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలింది.
ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్పై సస్పెన్షన్ వేటు
ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్పై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. రమేష్ను సస్పెండ్ చేస్తున్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది. నాగపురి రమేష్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. డోప్ టెస్ట్ కు సాంపిల్స్ ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. ఈ అంశంలో వారికీ కోచ్ గా ఉన్న నాగపురి రమేష్ పై వేటు పడింది. కాగా.. నాగపురి రమేష్ గతంలో ద్రోణాచారి అవార్డు పొందారు. అంతర్జాతీయ ప్లేయర్స్ దుతి చంద్, పారా ఒలంపియాన్ జీవంజి దీప్తి, నందిని వంటి దిగ్గజ క్రీడాకారులను తీర్చిదిద్దారు. నాగపురితో పాటు మరో ఇద్దరు అసిస్టెంట్ కోచ్లపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఈ అంశంపై తాజాగా రమేష్ స్పందించారు. “నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయలేదు. చేసిన వారిని ప్రోత్సహించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభా వంతులైన పేద క్రీడాకారులను తీర్చిదిద్దడానికే నా జీవితాన్ని దారపోశా. ఈ విషయంలో ఎలాంటి విచారణకైన సిద్ధం.” అని స్పష్టం చేశారు.