NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అందుకే నల్ల షర్టు వేసుకున్నా.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

హరీష్ రావు, కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరూ కలిసి మా జిల్లాకు నష్టం చేకూరే పనులు చేస్తున్నారు.. అందుకే నల్ల షర్టు వేసుకున్నానని మంత్రి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరైడ్ కు శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బీసీ అన్నారు. ఎస్ఎల్బీసీ, మూసీ శుద్దికరణ విషయంలో ముఖ్యమంత్రిని అభినందుస్తున్నా అన్నారు. ఒక వైపు ఫ్లోరైడ్, మరోవైపు కోటిన్నర మంది వాడిన నీరు నల్గొండలో పారుతుందన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ లో 5 వేల కోట్లు దోచుకుతిన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కొడుకు అంటే గుర్తు పడతారు కాని.. కేటీఆర్ అంటే ఎవరూ గుర్తు పట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయినా అహం తగ్గలేదన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగి వేల కోట్లు సంపాదించి ఎక్కడ పెట్టుకోవలో తెలియని డబ్బులు సంపాదించారన్నారు. అరె కేటీఆర్ నల్గొండ మంత్రులు రెచ్చగొడితే రెచ్చి పోరు.. స్వతహాగా పౌరుషం ఉన్న వ్యక్తులము అన్నారు.

చరిత్ర తిరిగి రాయడానికి సిద్ధమయ్యం.. జెట్ స్పీడ్‌తో పనులు..

ఒక చరిత్ర తిరిగి రాయడానికి మనం సిద్ధమయ్యం.. ఎంతమంది రాక్షస మూకలు వచ్చినా ఈ అమరావతిని బ్రతికించిన ఘనత ఇక్కడి రైతాంగానిదే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతిలోని లింగాయపాలెం దగ్గర సీఆర్డీఏ బిల్డింగ్ మిగిలిన పనులను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు.. దీంతో.. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టినట్టు అయ్యింది.. 160 కోట్ల రూపాయలతో జరపాల్సిన సీఆర్డీఏ కార్యాలయ ఇంటీరియర్ పనులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు.. గడిచిన ప్రభుత్వం అమరావతి రైతాంగాన్ని బాధపెట్టారు.. రైతు మహిళలు వీరోచితంగా పోరాడారు ఇక్కడ.. అడుగడుగునా అమరావతి రైతులను ఇబ్బంది పెట్టారు.. బాత్ రూమ్‌లపై కూడా డ్రోన్లు వేసి పైశాచిక ఆనందం ప్రదర్శించారని మండిపడ్డారు..

ఎవరు అడ్డు వచ్చిన అక్రమార్కుల సంగతి ఖచ్చితంగా తేల్చుడే..

హైడ్రా పనులకు ఎవరు అడ్డు వచ్చిన అక్రమార్కుల సంగతి ఖచ్చితంగా తేల్చుడే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయాలని కొంతమంది ఆర్థిక ఉగ్రవాదులు ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లందరి భరతం పడుతుంది మా ప్రభుత్వం అన్నారు. న్యాయంగా అనుమతులున్న ఏ ఆస్తిని ప్రభుత్వం టచ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అనుమతులు ఉన్న ఏ రియల్ ఎస్టేట్ సంస్థని ఇబ్బందులు పెట్టరన్నారు. సమస్యలు ఉంటే ప్రభుత్వానికి తెలియచేయాలని కోరారు. అక్రమార్కుల సంగతి కచ్చితంగా తేల్చుడే అన్నారు. గాంధీ కుటుంబంలో ఆరు తరాల గొప్పతనం చెప్పిన..
మీ గురించి చెప్పాలంటే దోపిడీ కుటుంబం… దొంగల కుటుంబం.. అధికార దుర్వినియోగం చేసి సంపాదించిన కుటుంబం మీదని కేటీఆర్, హరీష్ రావ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.హవాయి చెప్పు వేసుకొని తిరిగిన వాళ్ళు.. ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కబ్జాకోరుల పట్ల హైడ్రా అంకుశం అవుతుందన్నారు. నాళాలు చెరువులు కబ్జాలు చేసి ఏడంతస్తుల మేడలు కట్టే వారి పట్ల హైడ్రా అంకుశమే అన్నారు.

నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. గన్ మెన్ లు లేకుండా రా.. మూసీ, మల్లన్న బాధితులకు వద్దకు వెళదాం.. నేనే కారు నడుపుతా అని హరీష్ రావు మాటలకు ఇవాళ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసి కి వస్తావా.. మురికి వాడికి వస్తావా అని సవాల్ చేస్తున్నారు.. ఇప్పుడు మూసి పక్కనే ఉన్న నేను.. హరీష్ రావు నీలాంటి చెప్పులు మోసేటోడు పిలిస్తే కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్ లో బోర్లా పడుకున్న వారిని రమ్మను నేను వస్తా.. నీతో స్థాయి నీతో బతుక అన్నారు. హరీష్ నీ సంగతి నాకు తెలవదా.. మా కాంగ్రెస్ దయ తలిస్తేనే గండిపేటలో ఫామ్ హౌజ్ కొనుక్కునే పరిస్థితికి వచ్చావన్నారు. హవాయి చెప్పులతో తిరిగిన నువ్వు ఇంతకీ ఎలా ఎదిగావు? నేను నీ వెనకాల ఉండి తొంగి తొంగి చూడొచ్చు.. కానీ నీలాగా నేను దొంగతనాలు చేయలే అన్నారు.

గోషామహల్‌లోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ

హైదరాబాద్ కలెక్టరేట్‌లో గోషామహల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 144 మంది లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దీపావళి పండగ కొత్త ఇంట్లో జరుపుకునేలా పండగకు ముందే ఇళ్లు ఇస్తున్నామన్నారు. రాంపల్లి డబుల్ బెడ్ రూమ్స్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, మనకు వచ్చిన ఇంటిని, ఇంటి పరిసరాలను మంచిగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నామని, మూసీ పై రాజకీయ నాయకులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వమే కదా.. అక్కడున్న పేద వాళ్ళని అక్కడే వదిలేస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ లో ఉండే పేద ప్రజలకు ప్రత్యామ్నాయ ఇళ్లు, విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, అన్ని వర్గాల వారికి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ ఏర్పాటు అయినపుడు మిగులు బడ్జెట్ తో అధికారం ఇస్తే.. ఇప్పుడు 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్ళిపోయారని, తెలంగాణ ఉద్యమంలో శవాల పైన పేలాలు ఏరుకొని శవ రాజకీయాలు చేశారన్నారు. బాధ్యతగల ప్రతిపక్షంగా సూచనలు చేయాలి గాని.. విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఏపీలో మద్యం పాలసీపై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

మద్యం, ఇసుకలో దోపిడీ అంటూ జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు సిగ్గు చేటన్నారు. ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి మద్యాన్ని దోచుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. సెబ్‌ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. తయారీ నుంచి రిటైల్ అమ్మకాల వరకు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వ షాపుల పేరుతో దోచుకున్నది నిజం కాదా అంటూ అడిగారు. జగన్ కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ షాపుల్లోనే వేలాది ఎమ్మార్పీ ఉల్లంఘనలు చోటు చేసుకోవడంపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎప్పుడూ లేని విధంగా 2019-24 మధ్య అక్రమ మధ్యం రవాణా కేసులు ఎందుకు నమోదయ్యాయన్నారు. మన రాష్ట్రంతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో ఎందుకు అంతా ఆదాయం తేడా వచ్చిందో సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న, దేశ వ్యాప్తంగా ఉన్న మద్యాన్ని ఏపీలో అందుబాటులో ఉంచేలా పాలసీ తీసుకొచ్చామన్నారు.

గుర్లలో భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి..

విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా ప్రస్తుతం కంట్రోల్‌లో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 13న తొలి డయేరియా కేసు నమోదైందని తెలిపారు. గుర్లలో ఎనిమిది మంది మృతి చెందినా.. ఇప్పటి వరకు డయేరియాతో మృతి చెందిన వారు ఒక్కరేనన్నారు. కేవలం గుర్ల గ్రామంలోని భూగర్భ జలాలు కలుషితం కావడం మూలంగానే డయేరియా వ్యాపించిందని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా నీరు అందంచడం ద్వారా వచ్చిందని చెబుతున్నారని.. ఇది అవాస్తవమన్నారు.

నిడదవోలులో ఆర్వోబీ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును రైల్వే అధికారులను, రహదారులు భవనాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించామన్నారు. ఆర్ఓబి నిర్మాణం జరిగే చోట ప్రధాన కాలువ ఉండడం, ఆ కాలువ ద్వారా సాగునీరు వస్తుండడం వల్ల ఆర్‌వోబీ పనులకు కొంత ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు. ఆర్ అండ్ బీ అధికారులు, రైల్వే అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, రైతులు కలిసి సమన్వయంతో పనులు సక్రమంగా జరిగేలా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఆర్ఓబీని 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు.

రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే

వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అని బీఆర్‌ఎస వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్‌ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని, లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు కేటీఆర్‌. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందని, ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారన్నారు. మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదని, సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారన్నారు కేటీఆర్‌. ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదన్నారు.

సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

నిరుద్యోగులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. తాను అశోక్ నగర్ వచ్చి గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు బండిసంజయ్‌. పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థలతో కలిసి.. గ్రూప్-1 అభ్యర్థులతో పాటు వారికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. గ్రూప్‌1 అభ్యర్థులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్‌. అనంతరం గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయానికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు ర్యాలీని అడ్డుకోవడంతో వారితో బండి సంజయ్ వాగ్వాదానికి దిగారు. తాము సచివాలయానికి వెళ్లి తీరుతామని స్పష్టం చేశారు. అయితే.. ఈ నేపథ్యంలోనే సచివాలయం వైపు వెళ్తున్న నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. పోలీసులు, గ్రూప్‌-1 అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. గ్రూప్‌-1 అభ్యర్థులకు మద్దుతుగా.. తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ దగ్గరకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చేరుకున్నారు.. సచివాలయం వైపు బీఆర్‌ఎస్‌ నేతలు దూసుకెళ్లడంతో ఒక్కసారి గందరగోళ పరిస్థితి నెలకొంది.