ఒకప్పుడు సినిమా విజయంలో సంగీతం ఒక భాగం మాత్రమే, కానీ ఇప్పుడు సినిమా సగం సక్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో యావరేజ్ సినిమాలు కూడా హిట్ స్టేటస్ అందుకున్నాయి. అయితే, ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాలకు సరైన సంగీత దర్శకుడిని ఎంచుకునే విషయంలో అయోమయంలో ఉన్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్లందరి దగ్గర ఏదో ఒక సమస్య ఉండటంతో ఎవరిని సంప్రదించాలో తెలియక నిర్మాతలు సతమతమవుతున్నారు.
Also Read : Funky : ఫంకీ సినిమాలో మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా?
ఎస్.ఎస్. తమన్ టాలెంట్ మీద ఎవరికీ సందేహం లేదు, కానీ ఆయన గ్రాఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. బాలయ్య సినిమాలు అంటే థియేటర్స్ దద్దరిల్లేలా మ్యూజిక్ ఇచ్చే తమన్, మిగిలిన హీరోల సినిమాలకు మాత్రం ఎందుకో ఆశించిన స్థాయిలో అవుట్పుట్ ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ‘హీరో’గా అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు. ఆయన స్వయంగా హీరోగా నటిస్తుండటంతో, ఇక మీదట ఇతర సినిమాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెడతారా? సమయం కేటాయిస్తారా? అన్నది నిర్మాతలను వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. ఆయన పేరు ఉంటే సినిమాకు భారీ హైప్ రావడం ఖాయం. కానీ అనిరుధ్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. సాధారణ బడ్జెట్ సినిమాలకు ఆయన ‘టూ కాస్ట్లీ’. అంతేకాకుండా, చేతిలో డజన్ల కొద్దీ సినిమాలు ఉండటంతో సరైన సమయానికి మ్యూజిక్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పెద్ద హీరోలు కూడా ఆయన కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. స్థానిక సంగీత దర్శకుల సమస్యల వల్ల నిర్మాతలు ఇప్పుడు సామ్ సీఎస్ మరియు అజనీష్ లోక్నాథ్ వంటి వారి వైపు చూస్తున్నారు. సామ్ సీఎస్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకుంటుండగా, అజనీష్ ‘కాంతార’ వంటి సినిమాలతో తన సత్తా చాటారు. అయితే వీరు కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే పరిమితమా? టాలీవుడ్లోని భారీ కమర్షియల్ మాస్ సినిమాలకు, పెద్ద హీరోల ఇమేజ్కు తగ్గట్టుగా వీరు సంగీతం అందించగలరా? అన్న సందేహం ట్రేడ్ వర్గాల్లో ఉంది. మొత్తానికి, టాలీవుడ్ పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ను ఫైనల్ చేయడం అనేది ఇప్పుడు నిర్మాతల పాలిట ఒక పెద్ద సవాలుగా మారింది.